ఏలూరు పార్లమెంట్ సీటును చంద్రబాబు నాయుడు పుట్టా మహేష్ యాదవ్కు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ మహేష్ది కడప జిల్లా. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. యనమల రామకృష్ణుడి అల్లుడు. వాస్తవానికి ఏలూరులో గోరుముచ్చు గోపాల్ యాదవ్ చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఈయన ఎన్ఆర్ఐ. సింగపూర్లో ఉండేవారు. చంద్రబాబు సీటు ఇస్తామని ఆశపెట్టి పిలిపించి బాగా డబ్బు ఖర్చు పెట్టించారు. అయితే చివర్లో టికెట్ను మహేష్ యాదవ్కు బాబు అమ్మేశారు. దీంతో రెండు రోజుల నుంచి గోపాల్ యాదవ్ వర్గం, బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. కడప నేత వద్దు.. స్థానిక ముద్దంటూ ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి బీజేపీ నేతలు ఏలూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చీఫ్ పురేందశ్వరి సీనియర్ కమలం నేతలకు చెక్ పెట్టారు. టీడీపీ చెప్పినట్లు నడుచుకున్నారు. దీంతో మహేష్ యాదవ్ తెరపైకి వచ్చారు. చంద్రబాబు, లోకేశ్ల కుట్రలకు గోపాల్ యాదవ్ బలయ్యాడు. రాజకీయాల్లోకి తెచ్చి డబ్బు ఖర్చు పెట్టించి మోసం చేశారని ఆయన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోపాల్ యాదవ్ వర్గీయులు అధిష్టానంపై కన్నెర్ర చేశారు. టైర్లు దహనం చేసి, కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు నమ్మించి గొంతు కోశారని ఆవేదన వెలిబుచ్చారు. బీసీ డిక్లరేషన్ అన్నప్పుడు వారికి పెద్దపీట వేస్తారని అనుకున్నాను. కానీ ఓన్లీ యనమల ఫ్యామిలీ, సుధాకర్ యాదవ్ ఫ్యామిలీ అని నాకు తెలియదు. యనమల నాకు వెన్నుపోటు పొడిచారు. 25 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు ఓసీలకు తప్ప బీసీలకు ఎక్కడా కూడా పెద్ద స్థానాలు కల్పించలేదు. కడప వ్యక్తిని తీసుకొచ్చి ఏలూరు టికెట్ ఇవ్వడం అన్యాయం. ఇక్కడ యాదవులు మీకు కనిపించలేదా? బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని గోపాల్ యాదవ్ తెలిపారు.
ఇంక గొడవ జరుగుతున్నా చంద్రబాబు వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అవసరం తీరాక వదిలేయడం ఆయనకు అలవాటే కదా.. గోపాల్ యాదవ్ ఎన్ఆర్ఐ కాబట్టి బాగా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు రుచి చూపించి తమకు కావాల్సిన వారికి టికెట్ను అమ్మేసుకున్నారు.