అమ్మో ఆ సీటునుండి పోటీ చేయడం మావల్ల కాదంటూ పలాయనం చిత్తగిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడా సీటునుండి ఎవరు పోటీ చేస్తారా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుండగా ఆ నియోజకవర్గం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నియోజకవర్గమే చీపురుపల్లి. బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుండి పోటీకి టీడీపీ నాయకులు ససేమిరా అంటున్నారు. బొత్సను ఢీకొట్టి ఓడిపోవడం కన్నా అక్కడనుండి పోటీ చేయకుండా ఉండటమే మంచిదనే భావనలో టీడీపీ నేతలున్నట్లు సమాచారం.
బొత్స సత్యనారాయణను ధీటుగా ఢీకొట్టే నాయకుడి కోసం వెతికిన చంద్రబాబు గంటా శ్రీనివాసరావును బొత్సపై పోటీగా నిలబెడితే బావుంటుందని భావించాడు. ఒక్కో ఎన్నికకు ఒక్కో సీటునుండి పోటీ చేయడం గంటా శ్రీనివాసరావు ప్రత్యేకత కావడంతో ఈసారి చీపురుపల్లి నుండి పోటీకి దిగమని గంటాను చంద్రబాబు ఆదేశించాడు. కాగా ఇప్పటికే భీమిలిలో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న గంటాకు చీపురుపల్లి నుండి పోటీ చేయడం ఇష్టం లేదు. చీపురుపల్లి నుండి పోటీ చేస్తే తనకు పరాభవం దక్కడం ఖాయమని భావించి అక్కడ నుండి పోటీ చేసే ప్రసక్తే లేదని చంద్రబాబుకు గంటా తేల్చి చెప్పడంతో మరో నేత కోసం చంద్రబాబు అన్వేషణ మొదలుపెట్టాడు.
తాజాగా ఎచ్చెర్ల సీటుపై కన్నేసిన కిమిడి కళా వెంకటరావును బొత్సపై పోటీకి దింపాలని చంద్రబాబు భావించి ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించాడు. ఇదిలా ఉంటే ఎచ్చెర్ల సీటును ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఆశిస్తుండడంతో సీటును ఎవరికివ్వాలో తెలియక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. దీంతో కళా వెంకటరావును చీపురుపల్లి నుండి పోటీ చేయిస్తే ఎచ్చెర్ల టీడీపీలో నెలకొన్న గ్రూపు తగాదాలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కిమిడి కళా వెంకటరావు మాత్రం అక్కడనుండి పోటీకి విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కళానే బొత్సపై పోటీకి దిగుతారా అంటే అనుమానమనే చెప్పాలి. రాజకీయ దురంధరుడిగా పేరుపొందిన బొత్స సత్యనారాయణను చీపురుపల్లిలో ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. సామదానభేద దండోపాయాలు ప్రయోగించినా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గెలవడం అసాధ్యమైన పనే అని చెప్పొచ్చు. దాంతో అక్కడ పోటీకి టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. మరి బొత్సపై పోటీకి ఏ నాయకుడిని సిద్ధం చేస్తారో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.