మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు బాహుబలి కలెక్షన్స్ను తలపిస్తోంది. పూర్తిగా జన బలం లేకపోవడంతో కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మందికి పైగా యువతను ఎన్ టీమ్గా నియమించి ఒక్కొక్కరికి వేల రూపాయల జీతాలిస్తున్నారు. డివిజన్లలో కీలకంగా ఉండే టీడీపీ నాయకులను ప్యాకేజీలు అందించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలు తెరిచి లెక్క లేకుండా సొమ్ము కుమ్మరిస్తున్నారు.
తాజాగా నారాయణ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మరో కార్యక్రమానికి తెరతీశారు. తన సిబ్బంది ద్వారా సిటీ నియోజకవర్గ పరిధిలోని వీధుల్లో ఉండే ఆలయాలు, మసీదులు, క్రైస్తవ ప్రార్థనా మందిరాల వివరాలు తెప్పించారు. అవి ఉన్న చోట్ల ఎన్ని ఓట్లు ఉంటాయో లెక్కలు తీయించారు. స్వయంగా తానే వెళుతూ.. ఒక్కోసారి నాయకులను పంపుతూ డబ్బులు ఇప్పిస్తున్నారు. ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముట్టజెబుతున్నారు. పైకి భక్తి.. గుడులు, మందిరాలు, మసీదుల అభివృద్ధి పేరు కనిపిస్తున్నా.. ఈ తంతు నడుస్తోందంతా ఓట్ల కోసమే.
నారాయణను చేరుకుని సమస్యలు చెప్పుకొనే పరిస్థితి సామాన్యులకు లేదు. అసలు ఆయన సొంత పార్టీ నేతలకే అందుబాటులో ఉండడు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే నేరుగా మాట్లాడే పరిస్థితి ఉంది. 2019లో ఓడిపోయాక జనాన్ని పట్టించుకోలేదు. సమస్యలుంటే చెప్పడం పరిష్కరిస్తానని ముందుకు రాలేదు. కోవిడ్ సమయంలో సాయం చేసిన దాఖలాల్లేవు. 24 ఎన్నికలకు ఆరునెలల ముందు సిటీకి వచ్చి తిరుగుతున్నారు. ఇప్పటికే నారాయణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిని గ్రహించి ఓటర్లను సెంటిమెంట్తో పడగొట్టి తనవైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే అక్రమ సంపాదన నుంచి రూ.కోట్లు బయటకు తీసి ఇస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక.. అధికారుల నిఘా ఉంటుంది. ప్రలోభ పెట్టడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడే వీధులకు వెళ్లి డబ్బు ఇచ్చి తనను గెలిపించాలని వేడుకుంటున్నాడు.
నారాయణకు వేల సంఖ్యలో విద్యాసంస్థలున్నాయి. వాటిలో ఉపాధ్యాయుల చేత పిల్లలకు నీతి వాఖ్యాలు చెప్పిస్తుంటారు. కానీ ఆయనలోనే నిజాయతీ లోపించింది. గెలిపిస్తే మంచి చేస్తానని జనానికి చెప్పలేకున్నారు. 2014– 19 వరకు మంత్రిగా చేసినా నెల్లూరు నగర వాసులకు చేసింది శూన్యం. భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి ప్రాజెక్టు పేరుతో కార్పొరేషన్ను అస్తవ్యస్తం చేసేశారు. రోడ్లు తవ్వించేసి తన మనుషులకు వర్కులు ఇప్పించి దోచుకున్నారు. చాలాచోట్ల పనులను అసంపూర్తిగా వదిలేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అందువల్లే నేడు జనం తనను నమ్మరని కోట్ల రూపాయలను వెదజల్లుతున్నాడు ఈ విద్యా మాఫియా లీడర్.