‘నాడు ఈ నోటితోనే బూతులు తిట్టాము. నేడు ఈ నోటితోనే ఆహా ఓహో అంటూ పొగడాలా.. ఓరయ్యో.. బాబయ్యా..’ తెలుగు తమ్ముళ్లకు సరిపోయే సాంగ్ ఇది. ‘ఈ చేతితోనే బాబు కాబోయే ప్రధానంటూ రాశాము.. కాంగ్రెస్ని లేపాము.. బీజేపీని తొక్కాలని చూశాము. ఇప్పుడు ఈ చేతితోనే రాష్ట్రం కోసమే ఎన్డీఏలో చేరారంటూ అబద్ధాలు రాయాలా.. ఓరయ్యో నారయ్యా..’ ఇది ఎల్లో మీడియా వర్షన్. ఎలాగోలా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరిపోయారు. కానీ పాత విషయాలు మాత్రం జనం మర్చిపోవడం లేదు. 2018 నుంచి 2019 ఎన్నికల వరకు బాబు, టీడీపీ నేతలు కమలం పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులు, మోదీ, అమిత్షా తదితర నేతలను అన్న మాటలు, తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ నేడు వైరలవుతున్నాయి.
‘తల్లిని చంపి బిడ్డను బతికించారని, ప్రత్యేక హోదాతో ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి నరేంద్రమోదీ.. పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడేందుకు సిగ్గేయ్యటం లేదా..’ 2019లో చంద్రబాబు ట్వీట్ ఇది. ‘బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించే ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,16,000 కోట్లను ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టత ఇచ్చాక అడుగుపెట్టాలి’ ఇది లోకేశ్ ట్వీట్.
2024 ఎన్నికలు వచ్చే సరికి ఎన్డీఏలో చేరాక టీడీపీ అఫిషియల్ పేజీల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ టుగెదర్ అంటూ సింబల్స్తో కూడా పోస్టు వేశారు. పొత్తు పొడుపునకు కారణం రాష్ట్ర ప్రయోజనమేనంటూ చైతన్యరథం ఈ–పేపర్లో డబ్బా కొట్టుకున్నారు. నాడు తిడుతూ ట్వీట్లు పెట్టిన చంద్రబాబు, లోకేశ్.. నేడు మోదీ, షాకు ధన్యవాదాలు చెబుతున్నారు. 2019లో కాంగ్రెస్తో నారా వారు కలిస్తే.. దేశం కోసమని ఈనాడు హెడ్డింగ్ పెట్టింది. నేడు బీజేపీతో కలవగానే కూటమిదే విజయ దుందుభి అని రాసింది.
తెలుగు తమ్ముళ్లు చాలా ఫాస్ట్గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పొగుడుతూ, బీజేపీని తిడుతూ పెట్టిన ట్వీట్లను, ఫేస్బుక్ పోస్టులను డిలీట్ చేసే పనిలో పడ్డారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవన్నీ ఎప్పుడో వైరలయ్యాయి. ఇప్పుడు తీసేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మోదీ వచ్చాక మతోన్మాదం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. దేశం అస్తవ్యస్తమైందని అప్పుడు ప్రెస్మీట్లలో, ధర్మ పోరాట దీక్షల్లో కన్నెర్ర చేసిన టీడీపీ నేతలు ఇక నుంచి మోదీ గొప్ప ప్రధాని. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ పొగడాలి. తన కంటే జూనియర్ అయిన ప్రధానమంత్రికి బాబు ఇక ఒంగి ఒంగి దండాలు పెట్టాలి. తిరుపతిలో అమిత్షాపై రాళ్లు వేయించిన చేతులతోనే ఇప్పటి నుంచి పూలు చల్లించాలి. మోదీ వద్దంటూ వేసిన ఫ్లెక్సీల స్థానంలో ఆయన పెద్ద బొమ్మ వేసి నువ్వే మాకు దిక్కంటూ కొత్తవి వేయించాలి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని తెలుగు తమ్ముళ్లను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాలి పడుతున్నాయి. గతంలో టీడీపీ ట్వీట్లు, పోస్టులపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొత్తానికి తాను పిరికివాడినని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.