ఊసరవెల్లిలా రంగలు మార్చడంలో తెలుగుదేశాన్ని కొట్టేవారు లేరు. ఇండియాలో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఆ పార్టీనే. చంద్రబాబు నాయుడు హయాంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో రంగులు మార్చింది. భవిష్యత్లోనూ ఇది కొనసాగుతుంది. తాజాగా కొత్త రంగుల చొక్కాలకు ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తెలుగు తమ్ముళ్లకు వచ్చింది.
2018లో ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక చంద్రబాబు ప్రజలను నమ్మించేందుకు చిత్రవిచిత్రమైన వేషాలు వేశారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దని కేక్లు కట్ చేసి సంబరాలు చేసిన చరిత్ర ఆయనది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్లేట్ తిప్పేశారు. ఆ రోజుల్లో ప్రజా ధనంతో దీక్షలు చేశారు. నరేంద్రమోదీని వ్యక్తిగతంగా తిట్టారు. ముఖ్యంగా బాబు అండ్ గ్యాంగ్ నల్ల చొక్కాలు ధరించి తెగ తిరిగేశారు. కమలం పెద్దలు ఎవరైనా రాష్ట్రానికి వస్తే వారి తీరుకు నిరసన అంటూ అసెంబ్లీ, వివిధ కార్యక్రమాలకు బ్లాక్ షర్టులు ధరించి వెళ్లేవారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పచ్చ చొక్కాలు వదిలేసి నలుపు బాట పట్టారు. వారు చేసిన అతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
2019 ఎన్నికలయ్యాయి. మోదీ ఘన విజయం సాధించి మళ్లీ ప్రధాని అయ్యారు. దీంతో తమ్ముళ్లకు నల్లచొక్కాల అవసరం లేకుండా పోయి పారేశారు. ఐదేళ్లపాటు భజన చేశాక ఎట్టకేలకు మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ వెళ్లి చేరింది. మరోవైపు జనసేన తమతోనే ఉంది. ప్రస్తుతం పొత్తులో ఉన్నారు కాబట్టి ప్రధాని వచ్చినా హోదా ఎక్కడని బ్లాక్ షర్టులు ధరించి అడగాల్సిన అవసరం నేడు లేదు.
ఈనెల 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తెలుగుదేశం – జనసేన – బీజేపీ ఉమ్మడి సభ జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. దీనికి ఎవరి పార్టీ చొక్కాలు వాళ్లు వేసుకుని హ్యాపీగా వెళ్లొచ్చు. నల్ల వాటితో పనిలేదు.
కానీ బాబుతో ఉన్నప్పుడు అన్ని రంగుల షర్టులు పెట్టుకోవాలి. ఏదీ పారేయకూడదు. ఎప్పుడు దేనితో అవసరం వస్తుందో చెప్పలేము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చాలా పార్టీల రంగుల చొక్కాలను తన వాళ్ల చేత వేయించిన ఘనుడు ఆయన. కాబట్టి ఇప్పుడు కుట్టించుకునే కాషాయం కలర్వి పాడేయకుండా ఉంచి పెడితే ఎప్పటికైనా పనికొస్తాయి.