రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారులంతా ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచుల్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వై ఏపీ నీడ్స్ జగన్ అనే అంశం మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెంచుల్ రెడ్డి మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ చట్టం వలన వ్యాపారుల పరిస్తితి దుర్భరంగా మారింది. ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యాపారి ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని స్థితి నెలకొంది. వ్యాపారుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా స్పందన లేదు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్సార్ వ్యాపారుల తరపున చేసిన పోరాటం వల్ల విజిలెన్స్ చట్టం సస్పెన్షన్ లో పడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్యాకింగ్ చట్టాన్ని వ్యాపారుల శ్రేయస్సు కోసం ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ అమలుచేయలేదు.
గత ఏడాది ప్యాకింగ్ చట్టంపై మరోసారి కేంద్రం ఒత్తిడి తెచ్చినా ముఖ్యమంత్రి జగన్ చొరవతో అమలుకాకుండా నిలిచిపోయింది. అంతేకాకుండా ప్యాకింగ్ చట్టంలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలను ఇప్పించేందుకు జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మేలు చేసిన వారిని వ్యాపారులు జీవితాంతం మరిచిపోరు. అప్పట్లో దివంగత మహానేత వైఎస్సార్ వ్యాపారులకు న్యాయం చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తున్నారు. అందుకే వ్యాపారులంతా సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నామని సన్నపురెడ్డి పెంచుల్ రెడ్డి వెల్లడించారు.