విశాఖపట్నం అభివృద్ధి విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఉన్నారు. సోమవారం నాటి పర్యటనలో ఆయన అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవగానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. తన పాలన వైజాగ్ నుంచే కొనసాగుతుందని ఈ ప్రాంతంపై తనకు ఎంత మక్కువ ఉందో తెలియజెప్పారు. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో జరిగిన సదస్సులో ‘విజన్ విశాఖ’ డాక్యుమెంట్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో తను చేయాలనుకుంటున్న పనులను వివరించారు. విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు ఆ డాక్యుమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కీలకంగా చెప్పుకోవాల్సింది రూ.14,309 కోట్లతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు. రూ.4,727 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం. నగరాల అభివృద్ధిలో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. దీంతో జగన్ సర్కారు వీటిని డాక్యుమెంట్లో ప్రముఖంగా చేర్చింది. అలాగే రూ.975 కోట్లతో 24 గంటలు మంచినీటి సరఫరా పథకానికి రూపకల్పన చేశారు.
రహదారుల నిర్మాణంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కనెక్టివిటీలో భాగంగా రూ.8,980.82 కోట్లతో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణం, 6 లైన్ల బీచ్ కారిడార్ ప్రాజెక్టు, సబ్బవరం నుంచి షీలానగర్కు ఆరు లేన్ల రహదారి, షీలానగర్ నుంచి పోర్టు వరకు రోడ్డు, మరో రూ.1,906.15 కోట్లతో నగరంలో వివిధ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.196 కోట్లతో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రూ.2,633.47 కోట్లతో కనమాం వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు, ఇంకా మురుగునీరు శుద్ధి ప్లాంట్, కోడూరు వద్ద ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం వగైరా చేస్తారు. రూ.10,823 కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతోపాటు టీవీఎస్ లాజిస్టిక్స్, జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాలపై దృష్టి సారిస్తారు. రూ.1,703 కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, సోషల్ ఇన్ఫాస్ట్రక్చర్లో భాగంగా రూ.50 కోట్లతో 100 పార్కుల అభివృద్ధి, రూ.250 కోట్లతో 151 చెరువుల రూపురేఖలు మార్చే పనులను రానున్న 5 ఏళ్లలో చేపట్టనున్నారు.
ఇక క్రీడలకు సంబంధించి రూ.300 కోట్లతో అంతర్జాతీయ స్టేడియం, నగరంలో రూ.169.3 కోట్లతో ఇండోర్ స్టేడియంలనిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. రూ.40 కోట్లతో అమ్యూజ్మెంట్, ఫన్ జోన్లు ఏర్పాటు. రూ.87.5 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం. రూ.108 కోట్లతో నేచురల్ హిస్టరీ పార్కు, రూ.220 కోట్లతో కన్వెన్షన్ సెంటర్. రూ.18 కోట్లతో నేచురల్ కాటేజెస్ నిర్మాణం. రూ.394.8 కోట్లతో బీచ్ డెక్, సైన్స్ మ్యూజియం నిర్మాణం. రూ.178.22 కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు నిర్మాణం. రూ.16 కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. రూ.33.33 కోట్లతో అత్యాధునిక శ్మశానవాటికల ఏర్పాటు. ఇంకా రూ.4,039.20 కోట్లతో జగనన్న కాలనీల నిర్మాణం. రూ.1,250 కోట్లతో మాల్స్, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందకు సీఎం జగన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకు అవసరమైన ప్రతి అంశాన్ని డాక్యుమెంట్లో పొందు పరిచారు. అయితే ఎల్లో మీడియా విషం కక్కుతుండడంతో ఆయన స్పందించారు. తనకు స్వప్రయోజనాలుంటే కడప పేరు చెప్పలేనా అని ప్రశ్నించారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ రాజధాని అయ్యింటే బాగుండేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు గానీ పాలనా రాజధాని చేస్తే సహించడం లేదు. జగన్ ఏకంగా రూ.లక్ష కోట్లతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.