తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోని ఆయన మనుషులే ఈ కార్యాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు. ఏపీ కమలం పార్టీ కూడా ప్రస్తుతం బాబు మనుషుల చేతిలోనే ఉంది. అందులో అధ్యక్షురాలు పురేందేశ్వరి ఒకరు. మరొకరు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ప్రియ శిష్యుడు సత్యకుమార్. వీరిద్దరూ కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ స్ర్కిప్ట్ చదువుతున్నారు. నారా వారితో పొత్తు పెట్టుకుంటే మంచిదని కమలం పెద్దలకు చెబుతూ వస్తున్నారు.
వారిద్దరూ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. బీజేపీ పెద్దలను బతిమిలాడుకుని అపాయింట్మెంట్ తీసుకున్న బాబు బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ విచిత్రంగా స్పందించారు. సోదరి భర్త అయిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కలలు గంటున్న ఆమెకు •ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో తెలియదట. పార్టీ అధ్యక్షురాలనే విషయం మరిచిపోయినట్లుంది పాపం. ఇద్దరిని కలిపే పనుల్లో ఉండి కూడా పొత్తుల వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని, అధిష్టానం చూసుకుంటుందని సెలవిచ్చారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్కు కూడా విషయం అంతా తెలుసు. కానీ మరోలా స్పందించారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారని, తినబోతూ రుచి అడగొద్దని, 3, 4 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. బాబు రావాలని కోరుకుంటున్న కమలం నేతల్లో ఈయన ఒకరు. వాస్తవానికి ఏమి చేయాలో అంతా బాబు వివరించారు. దాని ప్రకారమే నడుచుకుంటున్నారు. కానీ నటించి నాయకులు, కార్యకర్తల్లో నవ్వులపాలయ్యారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ముందు ఉండవల్లి నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పొత్తు ఖరారైతే కీలక స్థానాలను వదులుకోవద్దని వారు బాబుకు గట్టిగా చెప్పారు. జనసేనకు కూడా స్వలంగా సీట్లు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీని ఇంకా తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీ అధినేత పరిస్థితి వేరేలా ఉంది. బీజేపీ పెట్టే డిమాండ్లకు ఒప్పుకుంటేనే పొత్తు ఉంటుంది. కానీ ఎల్లో మీడియా మాత్రం కమలం పార్టీయే పొత్తు కోసం పిలుస్తోందని ప్రచారం చేస్తోంది. బాబు బీజేపీ పెద్దలు చెప్పింది వింటారో.. తెలుగు తమ్ముళ్ల మాట నెగ్గుతుందో తెలియాలి.