చంద్రబాబు హయాంలో, సినీ పరిశ్రమ విశాఖకు తరలిపోనుందని ఊదరగొట్టి, విశాఖలో రామానాయుడు స్టూడియోకై ఇచ్చిన భూములపై ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. స్టూడియో అవసరార్ధం వాడుకొమ్మని అప్పటి ప్రభుత్వం సుమారు నలభై ఎకరాల భూమిని సురేష్ ప్రొడక్షన్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది.
అయితే ఇప్పటివరకూ, అక్కడ సినీ పరిశ్రమకు సంబంధించిన కట్టడాలేవీ నిర్మించకపోగా, స్టూడియోకై ఇచ్చిన భూమిని, అపార్ట్మెంటుల నిర్మాణం కోసమని గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కు పలుమార్లు సురేష్ ప్రొడక్షన్స్ తరఫు నుంచి దరఖాస్తులు కూడా అందాయి. గత ఏడాది మార్చి రెండున స్టూడియో భూములను రెసిడెన్షియల్ లేఅవుట్గా మార్చుకునేందుకు అనుమతిలిస్తూ అప్పటి కమీషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేసారు.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహితార్ధం వాజ్యం దాఖలు చేసారు. రెవెన్యూ స్టాండర్డ్ నెంబరు 24 కి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 కి వ్యతిరేకమనీ, భూ కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయమై హైకోర్టు గత ఏడాది మే 11న తీర్పును ఇస్తూ కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే సుప్రీం కోర్టులో వేసిన వాజ్యం నిన్ను విచారణకు రాగా కేసుని విచారించిన న్యాయమూర్తులు , అక్కడ జరగనున్న నిర్మాణాలపై స్టే విధించారు. ఈ ఏడాది మార్చి 11 లోపు స్పందించాలనీ, అప్పటి వరకూ అక్కడి స్థలంలో స్టూడియో అవసరార్ధం మినహా మరి ఏ ఇతర కట్టడాలను చేపట్టరాదని తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కోర్టుకు ఇవ్వాలని ప్రతివాది లాయర్లకు సూచనలు ఇచ్చింది.