వైస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో సదరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.. వచ్చేనెల 26 కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది..
కాగా వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపు పిటిషన్పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు.విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేసి 30 రోజుల సమయం కావాలని కోరారు. కాగా ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేనివిచారించగా ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు విచారించారు.