ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న వాళ్లంతా బయటికి వస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోసం అహర్నిశలు శ్రమించే మేధావులు ఎన్నికల నేపథ్యంలో తమ ముసుగులు తీసేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు కూటమికి మద్దతు ప్రకటిస్తూ వాళ్లే గెలవాలని రకరకాల కారణాలు చెబుతున్నారు.
చంద్రబాబుకు ధైర్యం తక్కువ. పిల్లనిచ్చిన ఎన్టీఆర్ నుంచి లాక్కొన్న టీడీపీపై కూర్చొని వేరే పార్టీల సాయంతో స్వారీ చేస్తున్నారు. బీజేపీతో కలవడం.. విడిపోవడం ఆయనకు అలవాటే. తన కోసం పనిచేసే మనుషులు ఆ పార్టీలో బోలెడు మంది ఉన్నారు. ప్రస్తుతం సీఎం రమేష్, పురందేశ్వరి, సుజనా చౌదరి తదితరులు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక కమ్యూనిస్టులతో కూడా నారా వారికి బలమైన సంబంధాలే ఉన్నాయి. నారాయణ, రాఘవులు, రామకృష్ణ, మరికొందరి స్టేట్మెంట్లు టీడీపీ అధినేతకు అనుకూలంగానే ఉంటాయి. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే జేబులో మనిషి. అందరి ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డే. ఈయనపై చేయని కుట్రలు లేవు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె దింపాలని బాబు వారందరితో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం పక్కాగా నడుస్తుంది. జగన్పై వాళ్ల అనే మాటల్ని ఎల్లో మీడియా జనంలోకి తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.
చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా వాయిస్ ఇచ్చే లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తాజాగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ తన ముసుగు తీసేశారు. ‘అరాచక పాలనకు చరమగీతం పాడతాం. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే వాళ్లకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు లోక్సత్తా అండగా ఉంటుంది. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించాలి. నాపై కులముద్ర వేస్తారని తెలుసు. రాష్ట్ర భవిష్యత్ కోసం తప్పడం లేదన్నారు. దీనిని స్వాగతిస్తున్నట్లు బాబు వెంటనే రిప్లై ట్వీట్ కూడా వేయడం జరిగింది. లోతుగా పరిశీలిస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. జేపీ 2014 సమయంలోనూ పరోక్షంగా వారికే మద్దతు ఇచ్చారు. కానీ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. కేంద్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. హోదా ఇవ్వని పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని బాబును ప్రశ్నించకుండా వారికే మద్దతు ఇవ్వడంతో ప్రజానీకం అవాక్కైంది. ఇక ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరి అయితే జేపీకి ధన్యవాదాలు తెలిపారు. తన సోదరి భర్త కోసం పనిచేసేవారు ఇప్పుడు ఆమెకు చాలా ముఖ్యం కదా..
ఒక్క జయప్రకాష్ కాదు.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఇలాంటి వారు ఇంకా బయటకు వస్తారు. కుల సంఘాలు, ఏదో సాధన సమితి పేర్లతో జగన్ను గద్దె దించాలని గద్దిస్తారు. చంద్రబాబు చూశారా.. అందరూ చెబుతున్నారంటూ ప్రచారానికి వాడుకుంటారు. ఇవన్నీ ఇప్పటి విద్యలు కాదు. దశాబ్దాలుగా బాబు చేస్తున్నవే. కానీ నమ్మేకాలం పోయింది.