పి. గన్నవరం అసెంబ్లీ సీటును టీడీపీ అధినేత చంద్రబాబు మహాసేన రాజేష్ కు కేటాయించడం ఇప్పడు ఆ నియోజకవర్గంలో మాదిగల తిరుగుబాటుకు కారణమైంది. టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కించుకోలేని ఆశావహులు ఇప్పటికే తమ నిరసన గళాలను వినిపిస్తుండగా ఎవరూ ఊహించని రీతిలో రాజేష్ మహాసేనకు పి.గన్నవరం టికెట్ కేటాయించడంతో అక్కడ దళితుల తిరుగుబాటుకు కారణమైంది.
టీడీపీ ఆవిర్భావం నాటి నుండి టీడీపీ వెంట నడిచిన మాదిగలను చంద్రబాబు మోసం చేసారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మోకాటి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మాదిగలను మోసం చేస్తూ వేరే ప్రాంతానికి చెందిన రాజేష్ మహాసేనకు పి.గన్నవరం టికెట్ కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన నాగేశ్వరరావు గతంలో చంద్రబాబు రెండుసార్లు ఎస్సీ మాదిగలకు సీట్ కేటాయిస్తానని దగా చేసారని మండి పడ్డారు.
మాదిగలకు పదవుల కేటాయింపులో ముఖ్యమంత్రి జగన్ పనితీరును ప్రశంసించాలని పేర్కొంటూ, మాదిగలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్నా ఎమ్మెల్సీగా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చారని వెల్లడించారు. టీడీపీకి ఓట్లేస్తున్న మాదిగలకు అన్యాయం చేస్తూ వారిని చంద్రబాబు నట్టేట ముంచారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మోకాటి నాగేశ్వరరావు మండిపడ్డారు. త్వరలోనే మాదిగలంతా సమావేశమై తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు..