‘చంద్రబాబు నాయుడూ.. 14 ఏళ్లు సీఎంగా చేశావు. ఆ సమయంలో ఇది చేశానని చెప్పుకునేందుకు ఏదైనా ఉందా?’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. కొద్దిరోజులుగా తెలుగుదేశం అధినేత, ఆయన తనయుడు నారా లోకేశ్లు ఎన్నికల సభల్లో అంటున్న మాటలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని స్పష్టం చేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం ఏమి చేశారని ఓటు అడుగుతావని బాబును ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని తెలిపారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే బాబుకు ఇంకేమి తెలియదని మండిపడ్డారు. అధికారంలోకి రారని తెలిసే ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారన్నారు. బాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని నిలదీశారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనన్నారు. అధికారంలోకి వచ్చేస్తామని బాబు పగటి కలలు కంటున్నారని, ఆయన నిర్వహిస్తున్న సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు.
సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా?.. 2014 నుంచి 19 వరకు ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయడం కరెక్టు కాదు. ఆయనకు సత్తా ఉంటే గతంలో ఏమి చేశారో చెప్పాలి. బాబు పాలన చెత్తపాలన అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం.. చంద్రబాబు సవాల్కు మేము సిద్ధం. మా నుంచి ఎవరో ఒకరు చర్చకు వస్తారు. అంతకంటే ముందు ఆయన గత పాలనలో ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలి. సీఎం జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో వివరించాలి. కౌంట్డౌన్ మొదలైంది. ఇంకో 50 రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు.
బాబూ నువ్వు మా వలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పగలవా.. సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఏ సభలోనూ సీఎం జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మాటలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. సీఎం జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు?. రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులను బాబు ఎలా సంపాదించారు?. సీఎం జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేశ్ ప్రకటన హాస్యాస్పదం. బాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అనేవారు. ఆ సంగతి తెలీక లోకేశ్ ఆ సామెతని జగన్కు చుడుతున్నాడు. జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని బాబు చెప్పుకొని బెయిల్పై బయటకు వచ్చారు. ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏమయ్యాయో చెప్పాలి. త్వరలోనే మేనిఫెస్టోని ప్రకటిస్తాం. చేయగలిగినదే చెప్తాం. చేయలేనివి ఎందుకు చేయలేక పోయామో కూడా వివరిస్తామన్నారు.