ఒకప్పుడు గర్భిణులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారు. అదే నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ధైర్యంగా వెళ్లి డెలివరీ చేయించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలే దీనికి ప్రధాన కారణం. ఆస్పత్రులను బలోపేతం చేసి.. వైద్యులు, సిబ్బంది, పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.
చంద్రబాబు నాయుడి పాలనలో పీహెచ్సీల్లో డెలివరీలు చేసే పరిస్థితి లేదు. అప్పట్లో గర్భణులు డెలివరీ కోసం వెళ్లినా ఇక్కడ సదుపాయాలు లేవని, చేయలేమని చేతులెత్తేసేవారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పులపాలయ్యే వారు. నేడు వైఎస్ జగన్ పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు సకాల సౌకర్యాలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వెయ్యికి పైగా పీహెచ్సీల్లో వైద్య సేవలను మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు వైద్యులు, స్టాఫ్ నర్సులు 3, ఫార్మసిస్ట్ 1, సూపర్ వైజర్లు-2, ల్యాబ్ టెక్నీషియన్ 1 చొప్పున అందుబాటులో ఉంటున్నారు. దీంతో కాన్పుల సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా డెలివరీ చేయడమే కాక బాలింత విశ్రాంతి కోసం ఆసరా పథకం ద్వారా పౌష్టికాహారం కోసం రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం చంద్రబాబు హయాంలో పీహెచ్సీల్లో 30 నుంచి 35 శాతమే ప్రసవాలు జరిగాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఇది 46 శాతానికి చేరింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది గర్భిణుల వివరాలు సేకరించి వారు ప్రతినెలా 9వ తేదీన ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకున్నారు. హైరిస్క్ వారికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గర్భిణులు ఆస్పత్రుల్లోనే పిల్లలకు జన్మనిచ్చేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంది. ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా మాతాశిశు మరణాలకు అడ్డుపడుతోంది.
ఉదాహరణకు ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 34 పీహెచ్సీల్లో మొత్తం 2,098 డెలివరీలు జరిగాయి. ఇందులో గతేడాది 1,224 డెలివరీలు కాగా ఈ ఏడాది జనవరికి నాటికి 874 డెలివరీ చేయడం విశేషం. కాన్పు అయిన బాలింతలకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆసరా కింద రూ.1.49 కోట్లు ఖర్చు చేసింది. నాడు బాబు హయాంలో గర్భిణులకు భరోసా కల్పించలేకపోయిన పరిస్థితులను చూసిన జనం నేడు జగన్ చేపట్టిన కార్యక్రమాలను చూసి హర్షిస్తున్నారు.