రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మూడో విడత రైతు భరోసా అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ నగదును రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ ఏడాది రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం రైతులకు అందిస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాట ఇచ్చారు. ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి మించి ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
తాజాగా ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి 2023–24 సీజన్ మూడో విడత రైతు భరోసాతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.1,078.36 కోట్లను,రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్మును అందించనున్నారు. మొత్తంగా 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని జగన్ సర్కారు అందించనుంది.
కాగా ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా జగన్ ప్రభుత్వం అందించనుండగా అదే విధంగా తాజాగా జమ చేసే సున్నా వడ్డీ రాయితీ మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లను జమ చేసినట్లవుతుంది. విత్తు నుండి విక్రయం వరకూ రైతుకు అండగా ఉంటున్న సీఎం జగన్ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తూ రైతును రారాజుగా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు..