పొత్తులో భాగంగా జనసేన తిరుపతి అసెంబ్లీ సీట్ ను తీసుకుంది. జనసేన నుంచి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు అలియాస్ ఆరణి శ్రీనివాసులును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత శ్రీనివాసులు వేగంగా పావులు కదుపుతున్నాడు. తిరుపతి పరిధిలోని 50 డివిజన్లో జనసేన అధ్యక్షుల మార్పులు చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పటివరకు బానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. తిరుపతి నగరంలో 50 డివిజన్లో జనసేన అధ్యక్షులు మార్పులు చేర్పులు చేస్తే ఊరుకునేది లేదని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వర్గం ప్రకటించింది. కిరణ్ రాయల్ ఎమ్మెల్యే టికెట్ ని ఆశించి భంగపడ్డాడు. తమ నాయకులను కాదని కొత్తవారిని అధ్యక్షులుగా చేస్తే సహించేది లేదని తెలిపారు. మార్పులు చేర్పులు జరిగితే అధిష్టానంతోనే తేల్చుకుంటామని కిరణ్ రాయల్ వర్గం స్పష్టం చేసింది. శ్రీనివాసులకి టికెట్ ఖరారు కావడంతో కిరణ్ రాయల్ వర్గం లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ తిరుపతి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
తిరుపతి సీటు జనసేనకి ఖరారు కావడంతో అక్కడ జనసేన నాయకులు నుంచి అభ్యర్థిత్వానికి పోటీ పెరిగిపోయింది. గతంలో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడంటూ పలు సర్వేలు నిర్వహించిన ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లిపోయాడు. కాగా ఇక్కడినుంచి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ పోటీ చేస్తాడని ఊహాగానాలు మొదట వచ్చిన ఆ తర్వాత జనసేన స్పోక్స్ పర్సన్ కిరణ్ రాయల్ కి అవకాశం దక్కుతుంది అంటూ ప్రచారం చేశారు. ఇద్దరిని కాదని పవన్ కళ్యాణ్ చిత్తూరు నియోజవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శ్రీనివాసులుని జనసేన పార్టీలో చేర్చుకొని తిరుపతి టికెట్ ఖరారు చేశాడు. పవన్ కళ్యాణ్ అంతటితో ఆగకుండా రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలనుకున్న టిడిపి నాయకుడు నరహరిని పార్టీలో చేర్చుకొని తిరుపతి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటికే నలుగురు నాయకులు ఎవరికి టికెట్ దక్కుతుందో లేదో అనే అయోమయంలో వారు ఉంటే ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ కి రాయబారం పంపింది. అవసరమైతే జనసేన తీర్థం పుచ్చుకొని జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మీడియాతో తెలిపింది. జనసేన అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అసలు పైన తెలిపిన వారికి టికెట్ కేటాయిస్తాడో లేదో చూడాలి.