ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరంతా ఐదేళ్లుగా పించన్లను ఇంటింటికీ పంపిణీ చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక, పథకాలను పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ దూరం పెట్టిన నేపథ్యంలో ఈ రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నాయకులు తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీంతో మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు పేర్కొన్నారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. అలాగే తాడిపత్రిలో 500 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పెందుర్తి, కుప్పం లో వాలంటీర్ల రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రెండు మూడు రోజులుగా మూకుమ్మడి రాజీనామాలకు దిగుతునే వున్నారు, ఇదే పరిస్దితి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ వాలంటీర్లు రాజీనామాలు చేసేసి నేరుగా వైసీపీ ప్రచారంలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఫించన్ విషయంలో అడ్డుకోవడంతో మనస్థాపం చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్ళి తాము ఎందుకు రాజీనామా చేశామో చెబుతూ టీడీపీ, జన సేన అధినేతలు చేసిన మానసిక దాడులను ప్రజలకు వివరించబోతున్నారు.
ఇది రానున్న రోజుల్లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే టీడీపీ కి, జన సేన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే వృద్ధులు తమ ఫించన్ లు దేనికి అడ్డుకున్నారు అని కూటమి అభ్యర్థులను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. రేపు వాలంటీర్లు తమ గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తే టీడీపీ , జన సేన నాయకులు గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే పరిస్థితులు కూడా వుండవు.