ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశానికి షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. పార్టీ పెట్టినప్పటి ఉంచి అండగా నిలిచిన కమ్మ సామాజికవర్గం జగన్ వైపు చూస్తోంది. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని బాగు చేయగలరని టీడీపీ కమ్మ నేతలు నమ్మి వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు, లోకేశ్ చేసిన మోసాల గురించి వివరించి జగన్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్కు తండ్రీకొడుకులకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం అతలాకుతలమైపోతోంది. శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి మరీ టీడీపీని ఏకిపారేశారు రంగారావు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎవరీయన..
రాయపాటి సాంబశివరావు. వ్యాపారవేత్త, సీనియర్ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం కొనసాగారు. ఐదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఈయన తనయుడే రంగారావు. వీరు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం నిర్మాణంలో పాలు పంచుకున్న కంపెనీ ట్రాన్స్ట్రాయ్కు యజమాని ఈ రంగరావే.
వారిద్దరూ డబ్బు మనుషులు
విలేకరుల సమావేశంలో అనేక విషయాలపై రంగారావు కుండబద్ధలు కొట్టారు. చంద్రబాబు, లోకేశ్కు డబ్బే ముఖ్యమని అందరికీ తెలుసు. తాజాగా ఆయన బయటపెట్టిన అనేక విషయాలు వారిద్దరూ ఎలాంటో వ్యక్తులో ప్రజానీకానికి మరోసారి తెలియజేశాయి. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని రంగారావు తెలిపారు. తండ్రీకొడుకులు ఎంతెంత తీసుకున్నారో లెక్కలున్నాయన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారని, అయినా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ అని రాయపాటి అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనన్నారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ఆ కంపెనీ తెస్తే అనంతపురంలో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరిలో ఎందుకు పోటీ చేశాడని నిలదీశారు.
రాయపాటికి అవమానం
అత్యంత సీనియర్ పొలిటీషియన్ అయిన తన తండ్రి సాంబశివరావును బాబు, లోకేశ్ అవమానించారని రంగారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయనకు చంద్రబాబు మనిషిగా పేరుంది. నేను సత్తెనపల్లి సీట్ అడిగితే కన్నాను ఇన్చార్జిగా నియమించడంతో రాయపాటి బాధపడ్డారని చెప్పారు. 2014లో సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి సీఎం చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఆనాడు లోకేశ్ను బాబు దొడ్డి దారిలో మంత్రిని చేసి అధికారాలు కట్టబెట్టారు. దీంతో ఆయన సీనియర్లను లెక్క చేయలేదు.
పోలవరం ‘ఏటీఎం’
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్రమోదీ గత ఎన్నికల ప్రచారంలో అన్నారు. అసలు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కట్టాలి. అయితే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు తాను కడతానని తీసుకుని దోచుకున్నాడు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని ట్రాన్స్ట్రాయ్ యజమాని అయిన రంగారావు బహిర్గతం చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారనే సంచలన నిజాన్ని బయపట్టారు. తండ్రీకొడుకులు తమని హింసించి మరీ డబ్బులు తీసుకున్నారని ఆవేదన చెందారు. వారి వల్ల ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత తమను ప్రాజెక్టు నుంచి తప్పించారని బాధపడ్డారు. అసలు ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పోలవరంను తమ ప్రభుత్వమే కట్టిందని, వైఎస్సార్సీపీ హయాంలో ఏమి జరగలేదని బాబు ఎల్లో మీడియా సాయంతో ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమేనని రంగారావు మాటలతో అర్థమైంది.
ఇంకా ఏమన్నారంటే..
బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని రంగారావు ఆరోపించారు. లోకేశ్కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో ఆయన్ను ఓడిస్తానని శపథం చేశారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని గుర్తు చేశారు.
జగన్పై ప్రశంసలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రంగరావు ప్రశంసలు కురిపించారు. పేదల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారన్నారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. ఆయన అంటే తమకు అభిమానమని, సీటు ఇస్తే పోటీ చేస్తానని మనసులో మాట బయటపెట్టారు.
టీడీపీ అవుట్
ఇప్పటికే తెలుగుదేశంపై ప్రజలకు నమ్మకం లేదు. ఏకంగా కమ్మ సామాజిక వర్గం నాయకులే బయటికొచ్చి చంద్రబాబు, లోకేశ్ల వ్యవహారశైలిపై సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. వారిద్దరూ ఏ విధంగా ద్రోహం చేశారో చెబుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూసిన ఆ పార్టీని జనం ఛీత్కరించుకుంటున్నారు. టీడీపీ వల్ల అప్పుల పాలైపోయిన నాయకులు, కార్యకర్తలు అది మునిగిపోయే నావని తెలుసుకుని జగన్కు జై కొడుతున్నారు.
– వీకే..