ఒంగోలు జనసేన పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరినట్టు తెలుస్తుంది. ఆ పార్టీ మహిళా నాయకురాలైన వీర మహిళగా పవన్ చే పిలిపించుకొన్న రాయపాటి అరుణపై జనసేన పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. పదవుల్లో ఏర్పడ్డ ఆదిపత్య పోరే ఈ దాడికి మూల కారణంగా కనిపిస్తుంది.
జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణపై అదే పార్టీకి చెందిన నాయకులు పాల్పడిన దాడిలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ వర్గానికి చెందిన ఒంగోలు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా ముత్యాల కళ్యాణ్ , అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చనపతి రాంబాబు, ఒంగోలు జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ఉన్నట్టు సమాచారం .
చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చనపతి రాంబాబు నేరుగా రాయపాటి అరుణపై దాడికి పాల్పడి ఆమె చాతీపై పిడిగుద్దులు గుద్దినట్టు, అక్కడితో ఆగకుండా సభ్యసమాజం వినలేని అసభ్యకర భాషలో బూతులు తిట్టినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అలాగే జరిగిన ఘటనను పార్టీ అధిష్టానానికి , హరిప్రసాద్ కి తెలియచేసినట్టు, వారు తనని లీగల్ గా వెళ్ళమని సలహా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
కాగా రాయపాటి అరుణ ఆధిపత్య ధోరణే ఈ వివాదానికి కారణం అయ్యుండొచ్చని కొందరు జన సైనికులు అభిప్రాయ పడుతున్నారు. అరుణ మాటతీరు, ప్రవర్తన ఆది నుండీ వివాదాస్పదమేనని పార్టీ ఒంగోలు విభాగంలో తనకి నచ్చిన వారు తప్ప మరొకరిని ఎదగనివ్వని ఆమె నైజం, వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో చిరంజీవి వలన పవన్ కి ఏ ఉపయోగం లేదని, పవన్ కి ఫెయిల్యూర్ పాత్ అందించి ఆయన హాయిగా సినిమాలు చేసుకొంటున్నాడని సంచలన విమర్శలు చేసి చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి గురయ్యిన విషయం ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకొంటున్నారు.