సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. సరుకుల కోసం రేషన్ షాపుల చుట్టూ తిరిగే బాధను ప్రజలకు తప్పించారు. ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 ఎండీయూ వాహనాలను ప్రారంభించారు. అవి ఇంటి ముంగిటకే వచ్చి బియ్యం, ఇతర సరుకులు అందజేస్తున్నాయి.
తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరి కనిపించేవారు. సరుకుల కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేవారు. రోజుల తరబడి తిరిగినా బియ్యం చేతికందని సందర్భాలు ఎన్నో.. బయోమెట్రిక్ సరిగా పడకపోతే మరుసటి రోజు షాపు వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇక వృద్ధులు, దివ్యాంగుల అవస్థలైతే వర్ణానాతీతం. పనిపోతుందని రోజువారీ కూలీలు, చిరుద్యోగులు రేషన్ తీసుకోకుండా ఆగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ కోసం క్యూలు కనిపించడం లేదు.. డీలర్ల చీదరింపులు లేవు.. బయోమెట్రిక్ పనిచేయడం లేదనే మాటలు వినిపించడం లేదు. లబ్ధిదారులు పనికి వెళ్లకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దకే రేషన్ వాహనం వచ్చి ఆగుతోంది. ప్రతి ఒక్కరికీ సరుకులు ఇచ్చి వెళుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఇది ఒకటి.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను చేర్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2కే కిలో బియ్యం పంపిణీ చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జగన్ ఎండీయూ వాహనాల ద్వారా పేదల ఇళ్ల వద్దకే సరుకులు చేరవేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మన్ననలు పొందుతున్నారు.
ఇంకా ఎండీయూ వాహనాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85, తదితరులకు వాహనాలు ఇచ్చారు. ఆ మొబైల యూనిట్లలో ఆధునిక తూకం యంత్రాలను సమకూర్చి రేషన్ అందజేస్తున్నారు. ఓ వైపు ఉపాధి మార్గం చూపడమే కాకుండా సరుకులు సులువుగా అందజేస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచే వలంటీర్ల సహకారంతో రేషన్ పంపిణీ జరుగుతోంది.