పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తప్పించారు. లేదు ఒత్తిళ్లకు తలొగ్గి తనకై తాను తప్పుకొన్నాడని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. కానీ బుధవారం ఈనాడులో వచ్చిన వార్తను చూసి తెలుగు తమ్ముళ్లు జట్టు పీక్కుంటున్నారు.
పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా రాజేష్ను చంద్రబాబు ప్రకటించారు. ఇతను అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచాడు. దీంతో అక్కడి తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బ్రాహ్మణ సంఘాల సభ్యులు తదితరులు భగ్గుమన్నారు. వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి రాజేష్ పోటీ నుంచి తప్పుకొంటున్నానని సోషల్ మీడియాలో ప్రకటించారు. అతను విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్ పెట్టిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడని వార్తలు వచ్చాయి. అయితే లోకేశ్ బుజ్జగింపులతో ఆగిపోయాడని సమాచారం. పి.గన్నవరం స్థానాన్ని వేరే వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం నిర్వహించిన దళిత శంఖారావంలో రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పి.గన్నవరం అభ్యర్థిగా ఈనాడు రాసుకొచ్చింది. అంతే కాకుండా స్వయానా రాజేష్ తానే పోటీ చేస్తున్నానని, రెండో రోజుల్లో ప్రచారం కూడా చేస్తానని ప్రకటించారు. ఈ విషయం టీడీపీ నేతలకే అర్థం కావడం లేదు. ఆయన తప్పుకొన్నాడు కదా.. అదంతా అబద్ధమేనా.. చంద్రబాబు ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దళితులను మంచి చేసుకోవడానికి చంద్రబాబు రాజేష్ను అభ్యర్థిగా చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం దళితులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పైగా మెజార్టీ శాతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుక ఉన్నారు. వైఎస్సార్సీపీ ఈ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. దీంతో బాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాజేష్ పోటీలోనే ఉన్నాడని తన మీడియా ద్వారా చెప్పిస్తూ దళితుల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు. అతడిని నియోజకవర్గాలకు పంపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.
మహాసేన మీడియా పేరుతో రాజేష్ చాలాకాలంగా జగన్పై తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఇతను చెబితే దళిత యువత నమ్మేస్తుందనే భ్రమలో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికలు పార్టీల మధ్య కాదని, దళితులు, జగన్ మధ్య అంటూ రాజేష్ పెద్ద పెద్ద డైలాగ్లు చెబుతున్నారు. దీనిని బట్టి బాబే ఈ విధంగా మాట్లాడిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరి మెప్పు కోసం తాను పోటీ చేయనని అతడి చేతే చెప్పించి.. ఇప్పుడు మరో వర్గం కోసం ఇలా డబుల్ ఆడుతున్న నారా వారిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు.