రఘురామకృష్ణరాజు విషయంలో తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరును చూసి జనం ఔరా అంటున్నారు. ఆయనకు నరసాపురం పార్లమెంట్ టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రచారం చేస్తూ అభాసుపాలవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పంచుకున్నాయి. ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. మరి రఘురామకు టికెట్ రాకపోవడానికి జగన్ ఎలా కారణమవుతారు. చంద్రబాబు నాయుడితో పొత్తులో ఉన్న కమలం పెద్దలు జగన్ మాట ఎందుకు వింటారు. తమ్ముళ్లు లాజిక్ లేకుండా మాట్లాడుతూ జనం చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారు.
రఘురామ 2019లో నరసాపురం ఎంపీగా గెలిచినా తిరిగిందంతా చంద్రబాబు గ్యాంగ్తోనే. ఎల్లో మీడియా డిబేట్లలో జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రులపై నిత్యం నోరుపారేసుకున్నాడు. ఢిల్లీలో బాబు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఆ మూడు పార్టీల్లో ఏదో ఒక దాని నుంచి మళ్లీ పోటీ చేస్తానని తొడకొట్టాడు. తీరా తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. అనే విధంగా బాబు వ్యవహరించారు. ఇంతకాలం వాడుకున్నాం కదా అని రాజు అడిగిన టికెట్ ఇవ్వలేదు. నరసాపురాన్ని బీజేపీకి కేటాయించేశారు. వాళ్లు వేరే వ్యక్తికి ఇచ్చారు.
ఇప్పుడు కూటమికి చెందిన వారు రఘురామపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. నరసాపురం సీటు దక్కకుండా జనగ్రెడ్డి కుటిల యత్నం.. ఆర్ఆర్ఆర్కు న్యాయం జరిగే వరకూ పోరాటమని కొత్త పాట మొదలుపెట్టారు. వుయ్ స్టాండ్ విత్ ఆర్ఆర్ఆర్ అంటూ మంగళవారం హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తారట. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వీరుడికి అండగా నిలబడేందుకు అందరూ తరలిరావాలని కోరారు. ఇదంతా చూస్తే నవ్వు వస్తోంది కదా.. టికెట్ తెచ్చుకుంటానని బిల్డప్ ఇచ్చింది ఆయన. ఎగ్గొట్టింది చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్. మధ్యలో∙జగన్ ఏం చేస్తాడు. ఆయనపై ఎందుకు ఏడుస్తున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
ప్రశ్నించే గొంతును జగన్ అణగదొక్కాలని చూస్తున్నారంటూ అటు రఘురామ, ఇటు తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తమతో పొత్తులో ఉన్న బీజేపీని అనరాని మాటలు అంటున్నారు. జగన్ చెబితే ఆ పార్టీ ఎందుకు వింటుందని అడుగుతుంటే ఎవరూ నోరు మెదపడం లేదు. అసలు రఘురామ టీడీపీ, బీజేపీ, జనసేనల్లో సభ్యుడు కాదు. వాటి కోసం ఏనాడూ పనిచేయలేదు. కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ వచ్చాడు. ఇస్తే బాబు టికెట్ ఇవ్వాలి. లేకపోతే బీజేపీని ఒప్పించి ఉండాలి. అలా కాకుండా వైఎస్సార్సీపీ అధినేతపై అభాండం వేయాలని చూస్తున్నారు. అయితే ఈ విషయం బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఉంది. బాబు కమలం పార్టీలో ఉన్న తన మనుషులకు కావాల్సిన టికెట్లు ఇప్పిస్తున్నాడు. కానీ రఘురామ విషయంలో చేతులెత్తేశాడు.
సరేలే ఆర్ఆర్ఆర్ అభిమానుల ముసుగులో ఉన్న తెలుగు తమ్ముళ్లూ.. పూజలయ్యాక రాజు గారి కుండ బిరియాని తినేసి కూల్డ్రింగ్ తాగేసి ఇంటికి పోండంటూ సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది.