రాజకీయాల్లో క్విడ్ ప్రో కో సర్వసాధారణంగా వినిపించే విషయం. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక వాహనం విషయంలో క్విడ్ ప్రో కో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది.
తాజాగా టీ టైమ్ ఉదయ్ ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆ సీటు విషయంలో పవన్ క్విడ్ ప్రోకో చేసారనే చర్చలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టీ టైమ్ యజమాని ఉదయ్ జనసేన పార్టీకి ధారాళంగా నిధులు కేటాయించారని, దాంతో పాటు వారాహి వాహనం కూడా ఆయనే సమకూర్చారని సమాచారం. వారాహి యాత్ర అంటూ పవన్ కొంతకాలం హడావిడి చేసినా పూర్తి స్థాయిలో మాత్రం యాత్రను కొనసాగించలేదు.
కాగా జనసేన పార్టీకి నిధులతో పాటు వాహనాన్ని సమకూర్చిన ఉదయ్ కి జనసేన సీటు కేటాయిస్తానని పవన్ ఒప్పందం చేసుకున్నారని అందులో భాగంగానే కాకినాడ ఎంపీ సీటును ఉదయ్ కు కేటాయించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే తాను కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తానని, ఉదయ్ పిఠాపురం సీటులో పోటీకి దిగుతారని ప్రకటించారు. పిఠాపురంతో పాటు కాకినాడ ఎన్నికల ఖర్చులను కూడా ఉదయ్ భరించనున్నారని అందుకే ఉదయ్ కి సీటును ఖరారు చేసారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో లో భాగంగానే జనసేనలో ఉదయ్ కి సీటు దక్కిందన్న వార్తలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.