వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అలియాస్ సతీష్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సతీష్రెడ్డి చాలా సంవత్సరాలపాటు టీడీపీలో ఉన్నారు. కడప జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. 2014, 19 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. అత్యంత సీనియర్ అయిన ఈయన్ను చంద్రబాబు పట్టించుకోవడం మానేశారు. తన కోసం హత్యా రాజకీయాలు చేసే బీటెక్ రవిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దీంతో అంతృప్తికి లోనైన సతీష్రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బాబు కూడా ఆయనతో ఇక పనిలేదని వదిలేశారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించగానే టీడీపీ నాయకులు వెళ్లి కలిశారు. దీంతో సతీష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని నిలదీసిన విషయం తెలిసిందే.
తాజాగా జగన్ సమక్షంలో పార్టీలో చేరిక అనంతరం సతీస్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 27 సంవత్సరాలపాటు టీడీపీ కోసం పనిచేశాను. వైఎస్సార్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ప్రేమ చూపించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాతో వైఎస్సార్సీపీ నాయకులు టచ్లోకి వచ్చారని తెలుసుకుని రాయబారానికి చంద్రబాబు మనుషులను పంపారు. ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు స్వార్థం కోసమే అలా చేశారు. తెలుగుదేశం ఎప్పుడో వ్యాపార సంస్థగా మారిపోయింది. బాబు నాయకత్వంలో రోజురోజుకి దిగజారిపోతోంది. ఇప్పుడు టీడీపీలో లోకేశ్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. జగన్ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేలా ఎందుకు ప్రవర్తించానా అనిపించింది. సీఎం జగన్ ఏది చెబితే అది చేస్తా. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తా.