మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనమూ పెంచుదామని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయాల ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో అనేక కీలక విషయాలను వెల్లడించిన వెంకట్రామిరెడ్డి ఏపీజీఈఎఫ్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, సచివాలయాల ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ మధుబాబు తదితరులతో కలిసి శుక్రవారం అనంతపురంలో ఈ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఏమన్నారంటే..
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినపుడు కొందరు హేళన చేశారు. కానీ సీఎం జగన్ మూడు నెలల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి సచివాలయాల వ్యవస్థను రూపుదిద్దుతుంటే ఓర్చుకోలేని కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి మేం అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదని విమర్శించాడు . ఇంకో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఎవరైనా మన సచివాలయ వ్యవస్థను టచ్ చేయగలరా?
వైఎస్ జగన్ కాకుండా వేరే ఎవరైనా సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్కు మరో సంవత్సరం, పరీక్షలకు ఇంకో సంవత్సరం, నియామకాలకు మరో సంవత్సరం తీసుకొనేవారు. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రొబేషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసేవారు. కానీ, మన ముఖ్యమంత్రి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఇంత పెద్ద వ్యవస్థకు ప్రాణం పోశారు.
రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి కొన్ని చానళ్లు, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తూ మానసిక దాడి చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే ఉంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరూ రోజుకు ఇద్దరిని చైతన్యం చేయాలి. ఇలా రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నా. సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని వెంకట్రామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో వెల్లడించారు.