2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఘనవిజయం సాధించబోతుందంటూ లగడపాటి రాజగోపాల్ సర్వేతో చెప్పించాడు చంద్రబాబు. తీరాచూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.ఆ ఘోర ఓటమి అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి గెలువకుంటే తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి తలెత్తింది. పార్టీ లేదు బొ* లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వెనుక దాగున్న అంతరార్ధం ఇదే. కానీ టీడీపీలో జవసత్వాలు నింపి తిరిగి పైకి లేపడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. తన అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వ పనితీరుపై బురదజల్లుతూ గోబెల్స్ ప్రచారం చేయించడంతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, బీజేపీతో పొత్తు కోసం దత్త పుత్రుడితో రాయబారాలు నడిపించడం చేస్తూ వచ్చాడు. అదీ చాలదన్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టాడు.
చంద్రబాబుతో జట్టు కట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పనితీరు బాలేదని ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం అని చెప్పుకురావడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని ప్రశాంత్ కిషోర్ ని దూషించిన బాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రశాంత్ కిషోర్ ను అద్దెకు తెచ్చుకున్నాడు. తీసుకున్న అద్దె డబ్బుకు ప్రశాంత్ కిషోర్ న్యాయం చేస్తున్నాడు. అందుకే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సర్వేలు సూచనలు సలహాలు ఇవ్వడం లేదని అంటూనే టీడీపీ జనసేన కూటమి ఏపీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని పీకే చెప్పుకురావడం గమనార్హం. ఆయన గతంలో అనేక రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో పలికిన చిలక పలుకులను ఓసారి గమనిస్తే కింది విషయాలు బోధ పడతాయి.
గత ఏడాది సెప్టెంబర్ 5 2023న తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందని పీకే జోస్యం చెప్పాడు. కానీ కాంగ్రెస్ గెలిచింది. 2022లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోతోందని ప్రశాంత్ చిలకపలుకులు పలికాడు కానీ అక్కడ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023 లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పీకే అన్నాడో లేదో అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడేమో ఏపీలో 120 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని కేంద్రం వద్ద సర్వేలున్నాయని తెలకపల్లి రవి వెల్లడిస్తున్న నేపథ్యంలో కొత్తగా పీకే వచ్చి టీడీపీని జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నించడం విశేషమనే చెప్పాలి. చంద్రబాబును కలిసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పీకే ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ తన జోస్యం చెప్పిన ప్రతీసారి తాను చెప్పిన పార్టీ కాకుండా వేరే పార్టీ గెలుస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పీకే జోస్యం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుండడం విశేషం.