రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులు, చేపట్టాల్సిన పనులు, నిధుల విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో ప్రధానమైనవి ఈ విధంగా ఉన్నాయి. ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్లో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఇంకా ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి రూ.12,911 కోట్ల నిధుల విడుదలకూ ఓకే చెప్పింది. ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయి. దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలి. పోలవరం మొదటి విడత పూర్తి చేసేందుకు దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని సీఎం ప్రధానిని కోరారు.
మరో అంశం విద్యుత్ బకాయిలది. 2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే చెల్లించేలా చూడాలి. ఇంకా విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా నెరవేర్చాలి. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా చాలా అవసరం. దీంతో పెట్టుబడులు రావడమే కాకుండా యువతకు మెరుగైన ఉపాధి లభిస్తుంది.
మెడికల్ కాలేజీల విషయాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 17 కళాశాలలు కట్టిస్తున్నాం. ఇప్పటికే కొన్నింట్లో తరగతులు మొదలయ్యాయి. కాలేజీలకు సంబంధించి పూర్తి సహకారం కావాలి.
విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారి అభివృద్ధికి సహకారం అందించాలి. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వయా కడప మీదుగా బెంగళూరు వరకూ పొడిగించాలి. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలి. కడప – పులివెందుల – ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం – హిందూపూర్ కొత్త రైల్వేలైన్ను చేపట్టాలి. దీని వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇంకా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి. ఇవే కాక ఇంకా అనేక అంశాలపై పీఎంతో చర్చించారు.