ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తరుపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఈనెల 6, 8 తేదీలలో పర్యటన ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి మద్దతుగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. అనకాపల్లి బహిరంగసభ తర్వాత ఆ రాత్రికి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.
మోడి తిరిగి మే8 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి పీలేరు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ రోడ్ షో లో పాల్గొని రాత్రికి ఢిల్లీ వెళ్లిపోతారు.