దేశవ్యాప్తంగా 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ఐఐఎం శాశ్వత భవనాన్ని ప్రారంభించడంతో పాటు ఐఐటీ (తిరుపతి), ఐఐఎస్ఈఆర్( తిరుపతి), ఐఐఐటీడీఎం (కర్నూలు), ఐఐఐటీ (శ్రీసిటీ) సంస్థలకు సంబంధించిన శాశ్వత భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
2016 నుంచి విశాఖ ఐఐఎంకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తుండగా విభజన హామీల్లో భాగంగా ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. అదేవిధంగా తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాలను కూడా పూర్తి చేయడం గమనార్హం.
కాగా ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.