బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతోంది. మూడు పార్టీల్లో అధిష్టానాలు పైన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు సైతం టికెట్ దక్కడం లేదు అంటూ ప్రతినిత్యం పార్టీ తరపున తన గలం వినిపించే పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదంటూ తన బాధను బయటపెట్టారు. ఇప్పటికే నరహరి, శేషు కుమారి, ఆమంచి స్వాములు జనసేన నుంచి బయటకు వచ్చేశారు.
తాజాగా మరో కీలక నేత జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముమ్మడివరం టికెట్ పితానికే అంటూ గతంలో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తన వారాహి యాత్రలో ముమ్మడివరంలో సభలో మాట్లాడుతూ మంత్రిని చేస్తానంటూ ప్రకటించాడు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ వాపోయారు.
దీంతో ఆయన జనసేనను వీడాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా జనసేనపై అసంతృప్తితో ఉన్న పితాని వైసీపీలో చేరడానికి సిద్ధమైయ్యారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో గురువారం పితాని భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 30న జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఆయనతో పాటు భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.