జూలకంటి బ్రహ్మానందరెడ్డి అలియాస్ బ్రహ్మారెడ్డి. ఈ మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. రౌడీ, హత్యా రాజకీయాలకు అతను పెట్టింది పేరు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తూ శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యాడు. 2021 డిసెంబర్ లో మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటించిన తర్వాత ఫాక్షన్ కుట్రలకు తెర లేపిన బ్రహ్మారెడ్డి ఎన్నికలు సమీపించే కొద్ది సానుభూతి కోసం చేసే చిల్లర పనులకు అంతే లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలపై అభాండాలు వేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.
బ్రహ్మారెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంభ 2004 సంవత్సరానికి ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడి అండ చూసుకుని ఆరోజు అతను చేసిన ఫ్యాక్షన్ పనులు అన్నీఇన్నీ కావు. అనేక హత్యలకు కారకుడని విమర్శలున్నాయి. తన అనుయాయుల చేత పొలాల్లో బోర్లు పూడ్పించడం.. పంటలు, గడ్డివాములు తగులబెట్టించడం.. మిర్చి పొలాలు ధ్వంసం చేయించడం వంటివి చేశాడు. అయితే వాటిని ప్రత్యర్థులపై నెట్టి ప్రయోజనం పొందాలని తీవ్రంగా ప్రయత్నించాడు. మాచర్ల ప్రజలు ఆయన్ను నమ్మలేదు. 2004 లో పిన్నెల్లి లక్ష్మా రెడ్డి కి 2009 నుండీ వరసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పట్టం కడుతూ వచ్చారు. 2011 తర్వాత మాచర్ల వదిలిపోయిన బ్రహ్మారెడ్డి మళ్ళీ 11 ఏళ్ల తరువాత తన ఫాక్షన్ నేపథ్యమే అర్హతగా టీడీపీ ఇంచార్జ్ గా చంద్రబాబు ప్రకటించడంతో మళ్ళీ మాచర్ల వచ్చాడు.
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న మాచర్లలో హత్యలు, దాడులు, దొమ్మీలు, ఆస్తుల విధ్వంసం లాంటి ఘటనలతో అలజడి రేగటం వెనక కారణం బ్రహ్మారెడ్డి అని ప్రపంచానికి తెలిసిన విషయమే, ఏ వివాడానికి అవకాశం దొరకని రోజు తన కార్యకర్తల ఆస్తుల ధ్వంసానికి పాల్పడి ఆ నేరం ఎదుటి వారి పై వేసే ఫ్యాక్షన్ కుట్రలకు కూడా వెనకాడలేదు జూలకంటి. అలాంటిదే నిన్న తెల్లవారుఝామున జరిగిన కారు తగలబడ్డ ఘటన.
సోమవారం అర్ధరాత్రి మాచర్లలో పదో వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త వీర్ల సురేష్ కారు కాలిపోయిందని, ఇది వైఎస్సార్సీపీ నేతల పనేనని బ్రహ్మారెడ్డి కట్టు కథ అల్లాడు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని తెలుస్తోంది. 2000 సంవత్సరం నాటి తన ఫ్యాక్షన్ పంథాను మళ్లీ ఎంచుకున్నాడు టీడీపీ ఇంచార్జ్ జూలకంటి . ఇటీవల ఆరు సెకండ్ హ్యాండ్ కార్లు కొని తన అనుచరులకు ఇచ్చాడని సమాచారం . అందులో మొదటిది సురేష్కు ఇచ్చాడు. అతను తన ఇంటి ముందు స్థలం లేదని, కారును సమీపంలోని బడి ముందు పార్క్ చేస్తే తగులబెట్టారని ఆరోపిస్తున్నాడు. కానీ బ్రహ్మారెడ్డి మనుషులే పాత కారును కాల్చేసి వైసీపీ కార్యకర్తల పై పై అభాండం వేస్తున్నారని తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో మిగిలిన వాహనాలను కూడా ఇలాగే కాల్చేసి వైసీపీ కార్యకర్తల పై నెట్టాలనేది ప్లాన్ అని మాచర్ల పట్టణంలో చర్చ సాగుతుంది .
పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న పిన్నెల్లి కుటుంబంపై బ్రహ్మారెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
తెలుగుదేశం అభ్యర్థి పనులపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకేరోజు ఏడుగురిని చంపిన కేసులో ఏ–1 ముద్దాయి బ్రహ్మానందరెడ్డి. నేరచరిత్ర ఉన్న వ్యక్తి. ప్రశాంతంగా ఉన్న మాచర్లలో గొడవలు సృష్టించేందుకు చంద్రబాబు అతడిని తీసుకొచ్చాడు. పదివేలు.. పదిహేను వేల రూపాయలకు పాత బైక్లు తీసుకురావడం.. తన మనుషుల చేత తగులబెట్టించి ఇది వైఎస్సార్సీపీ పని అంటూ ఆరోపిస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇప్పుడు పనికిరాని కార్లను తీసుకొచ్చి కాల్చేసి మా వాళ్లపై నెడుతున్నాడు. బ్రహ్మానందరెడ్డి తల్లి దుర్గాంభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. మళ్లీ ఆ వైపు తీసుకెళ్లేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. ఎవరు గొడవలను ప్రేరేపిస్తున్నారు. ఎవరు నిధులు తీసుకొచ్చి మాచర్లను అభివృద్ధి చేయాలని తప్పిస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
పౌరుషాల గడ్డపై మళ్లీ ఫ్యాక్షన్ ప్రకంపనలని మీడియా హోరెత్తిస్తోంది కానీ.. వాటిని బ్రహ్మారెడ్డి చిల్లర పనులు అంటే బాగుంటుందేమో.. ప్రజల మనసులో స్థానం సంపాదించి ఎన్నికల్లో గెలిస్తే నాయకుడంటారు. ఇలా ఇబ్బందులకు గురిచేసే బ్రహ్మారెడ్డి లాంటి వాళ్లని ఏమనాలో.