‘గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని చూశారు. ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశ పెట్టుకున్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్న పిల్లలను కూడా రోడ్డు వద్దకు తీసుకొవచ్చి ఆయనకు చూపించాలనుకున్నా. దీనిని బట్టి జగన్పై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలుస్తోంది’ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మేమంతా సిద్ధం బస్సు గుడివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అంతకుముందు నాని ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
రాజన్న బిడ్డను ఆశీర్వదించేందుకు గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభ ఒకరోజు వాయిదా పడింది. జగన్ను ఆశీర్వదించడానికి రావడం ఆనందంగా ఉంది. వైఎస్సార్సీపీ పాలనలో స్కూల్కు వెళ్లే పిల్లల నుంచి వృద్ధుల వరకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి దళారులతో పని లేకుండా సంక్షేమ పథకాలు అందించారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదల ప్రాణాలను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాపాడారు. జగన్ ఆయన కన్నా నాలుగడుగులు ముందుకేశారు.
జగన్ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. వారిది మాయా కూటమి. వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు. అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకున్నాడు. మేమంతా సిద్ధం సభలకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక జగన్ను భౌతికంగా తొలగించాలని విజయవాడలో దాడి చేయించాడు. సీఎం ఎప్పుడూ చెప్పే విధంగా దేవుడు, ప్రజల ఆశీస్సులున్నాయి కాబట్టే బయటపడ్డారు. అందరి దీవెనలతో ఆయన మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు ఏమీ చేయలేడు. జగన్కు దమ్ము, ధైర్యం ఉంది. ఆయన నిబద్ధతను దగ్గర నుంచి చూశాం. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి. ఓటు కోసం, పదవి కోసం చిన్న అబద్ధం కూడా ప్రజలకు చెప్పించలేనటువంటి పరిస్థితిని ఐదు సంవత్సరాలుగా దగ్గర నుంచి చూశాం.
చిన్న అబద్ధం చెప్పండన్నా అని ఎవరైనా బతిమిలాడినా ఆయన చెప్పరు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖరరెడ్డి చూపించిన దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న మనస్తత్వం ఆయనది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టాలని కోరుతున్నా. 420, వెన్నుపోటుదారుడైన చంద్రబాబు నాయుడ్ని పాతాళంలో పాతి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. బాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఆయన జగన్ అంతు తేల్చాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ఈ జిల్లాలో ఎంపీ, అసెంబ్లీ సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరుతున్నా.