ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఒక సరికొత్త ఆవిష్కరణ జరిగినా దానికి నేనే కారణం, నేనే స్ఫూర్తి అనో దాన్ని భారతదేశంలోకి తెచ్చింది నేనే అనో చెప్పుకోవటం చంద్రబాబుకి కొత్త కాదు. ఇటీవల ఆ సంప్రదాయానికి కొంచెం మార్పులు చేసినట్టు ఉన్నారు ఆయన . అన్ని అంశాలకి క్రెడిట్ తీసుకోవటం మానేసి కొన్ని అంశాల్లో తన మామ ఎన్టీఆర్ కి క్రెడిట్ ఇస్తున్నారు. బహుశా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మామగారితో మళ్ళీ అవసరం పడ్డట్టు ఉంది. ఈ క్రమంలో నిన్న ఎన్టీఆర్ ఖాతాలో ఓ ఘనత వేసేసారు చంద్రబాబు.
రాష్ట్రంలో మొట్టమొదట సామాజిక పెన్షన్ పధకం ప్రవేశ పెట్టింది మా మామ ఎన్టీఆర్ అంటూ సెలవిచ్చారు.
నిజమా పెన్షన్ పధకం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టారా, అంతకు ముందు ప్రభుత్వాలు పెన్షన్లు ఇవ్వలేదా అని తరచి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1961 లో వృద్దాప్య పెన్షన్ పధకాన్ని ప్రవేశపెట్టిన ఒక మానవతా వాది రూపం మన కళ్ళ ముందు ఆవిస్కృతం అవుతుంది.
1960 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉన్న దామోదరం సంజీవయ్య గారు చేపట్టిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, ఉద్యోగ కల్పన, సాధించిన కేంద్ర సంస్థలు, పేదలకు పంచిన లక్షల ఎకరాల భూముల గురించి చెప్పుకోవాలంటే ఆయన పాలనా కాలం అంత సమయం పట్టొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చిన్న గుడిసెలో జీవించే తన తల్లిని చూడటానికి ఒకరోజు వచ్చి ఆమె యోగక్షేమాలు కనుక్కొని తిరిగి వెళుతూ తల్లికి ఖర్చుల కోసం వంద రూపాయలు ఇచ్చారట.
పాపం ఆ మహాతల్లి నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి వంద రూపాయలు ఇచ్చావు. మరి ఏ ఆధారం లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో పాపం అన్న నిట్టూర్పుతో కూడిన మాటకి చలించిన సంజీవయ్య సుదీర్ఘ ఆలోచనలో నుండి పుట్టిందే
వృద్దాప్య పెన్షన్. 65 ఏళ్ళు దాటిన ఏ ఆధారం లేని వృద్దులకు నెలకు 25 రూపాయలు ఇచ్చే విధంగా పెన్షన్ పధకాన్ని అమలు చేశారు ఆయన.
ఇది జరిగింది 1961లో, ఆ సంవత్సరం రిలీజైన ఎన్టీఆర్ సినిమాలు 8, ఆ సినిమాల్లో కూడా పెన్షన్ ఇచ్చే సన్నివేశాలు కూడా లేవు . 1982 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్, 1985 లో రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత 1989 ఎన్నికలకు ఏడాది ముందు 1988 లో 25 రూపాయల పెన్షన్ ని ముప్పై రూపాయలు చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వం దాన్ని 75 రూపాయలు చేసింది. 1995 నుండి 2004 వరకూ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దాన్ని ఒక్క రూపాయి పెంచలేదు సరికదా ప్రపంచం విస్తుపోయే సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేశారు బాబు .
ఒక గ్రామంలో పెన్షన్ కోసం కొత్తగా ఎవరైనా అర్హత గలవారు అప్లై చేసుకొంటే క్యూ పద్దతిలో పెన్షన్ మంజూరు చేసేవారు. ఆ క్యూలో ముందు పెన్షన్ తీసుకొంటున్న పది మందిలో ఒకరు చనిపోతే తర్వాత క్యూలో ఉన్న ఒకరికి పెన్షన్ మంజూరు చేసేవారు. ఆ ప్రకారం ముందున్న వృద్ధుడు ఎప్పుడు చనిపోతాడా తనకి పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని వెనకున్న అభాగ్యుడు ముందున్న అభాగ్యుడి చావు కోసం ఎదురు చూడాలన్నమాట. చంద్రబాబు అమలు చేసిన ఇంత దుర్మార్గమైన పెన్షన్ విధానం భారత దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా అమలు చేసి ఉండదు.
2004 లో వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు విధించిన దుర్మార్గపు నిభందనలు తోసిరాజని అర్హులందరికీ పెన్షన్ అందుకొనే అవకాశం కల్పిస్తూ 75 రూపాయల పెన్షన్ 200 రూపాయలు చేసి అభాగ్య వృద్ధుల పాలిట పెద్ద బిడ్డ అయ్యాడు. దురదృష్టవశాత్తు వైఎస్ మరణం తర్వాత కాంగ్రస్ ప్రభుత్వం ఆ 200 రూపాయల పెన్షన్ ని కాలానుగుణంగా పెంచకుండా అంతే ఉంచింది.
కాలం మారి మళ్లీ 2014 లో బాబు గారి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం వర్గ రూపు దాల్చింది . జన్మభూమి కమిటీలకు ఎంపిక అధికారాలు ఇచ్చి తమ పార్టీ వారికీ , వర్గాల వారీగా ఎంచి నిబంధనలు అతిక్రమించి ఇచ్చుకోవటమే కాక వైరి పార్టీలకి చెందిన అర్హుల అర్జీలను తుంగలో తొక్కి దారుణమైన వివక్ష చూపారు . ఇహ ప్రతి పెన్షన్ కూ , సంక్షేమ పధకానికీ జన్మభూమి కమిటీ సభ్యులకు నజరానా తప్పనిసరి . టీడీపీ దారుణ ఓటమిలో ఈ కమిటీల పాత్ర అధికమే.
గతం గమనిస్తే బాబు గారి జమానాలో పెన్షనే కాదు ఏ సంక్షేమ పధకమైనా లబ్దిదారుడికి చేరాలంటే తలప్రాణం తోకలోకైనా రావాలి , లేదా పూర్తి ప్రాణం పోవాలి
ఆ ఆచారాన్ని తప్పనిసరిగా పాటించే బాబు 2014 తర్వాత అర్హులకు ఇచ్చే పెన్షన్లను సైతం సజావుగా అందించక తమ పార్టీ ప్రచారం కోసం గ్రామాల్లో అందర్నీ ఒకచోటకి పిలిపించి గుమిగూడాక వారితో పార్టీకి అనుకూలంగా వీడియోస్ తీసుకొని ఆ తర్వాత పెన్షన్లు పంచేవారు . మేజర్ పంచాయితీలు కానీ చిన్న గ్రామాల వారి బాధ అయితే చెప్పనలవి కాదు . కర్నూల్ జిల్లాలో వెంకటగిరి , పెండెకల్లి లాంటి గ్రామాల వారు ప్రతి నెలా బేతంచర్ల వరకూ ఎనిమిది కిలోమీటర్లు వెళ్లి పెన్షన్ , రేషన్ తెచ్చుకొనేవారంటే అప్పటి దుస్థితి ఆలోచించండి .
అంతే కాదు విజయవాడలో మరి కొన్ని చోట్ల పెన్షన్ కోసం క్యూలల్లో నిలబడి మరణించిన ఘటనలు , తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు కోకొల్లలు . అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటానికి ఏనాడూ ఆసక్తి చూపని టీడీపీ పార్టీ 2019 ఎన్నికల ముందు మాత్రం 2017 లోనే జగన్ ప్రకటించిన నవ రత్నాలలోని 2000 రూపాయల పెన్షన్ పధకాన్ని కాపీ కొట్టి 2019 జనవరి వరకూ వెయ్యి ఇస్తున్న పెన్షన్ ని హటాత్తుగా రెండు వేలు చేసింది .
అదే ఎన్నికలలో రెండు వేలుగా ఉన్న పెన్షన్ ని తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మూడు వేలకి పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే మొదటి ఏడు పెన్షన్ ని 2250 రూపాయలకు పెంచటమే కాక వృద్ధ , వికలాంగ , వితంతు పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇంటివద్దే అందించే బృహత్తర కార్యక్రమానికి విలేజ్ వలంటీర్ వ్యవస్థ ద్వారా నేడు శ్రీకారం చుట్టారు .
ఆయా గ్రామాల్లోని విలేజ్ వాలంటీర్లు నేడు ప్రతి గ్రామం , ప్రతి వార్డ్ , ప్రతి ఇంటి తలుపు తట్టి అర్హులను పలకరించి వారి వేలిముద్ర తీసుకొని పధకం తాలూకు సొమ్ముని వారికందించే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి లోగిలిలో పండగ కళ తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదు .
గ్రామ సీమ లోగిళ్ళల్లో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొల్పాలన్న నా తండ్రి కల నేను నెరవేరుస్తాను అన్న జగన్ మాట నిలుపుకొనే దిశగా ఓ గొప్ప ముందడుగు వేశాడని చెప్పొచ్చు . అలా ప్రతి యేటా 250 చొప్పున పెంచుకొంటూ ఈ ఏడు తాను హామీ ఇచ్చిన విధంగా 3000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తుంది జగన్ ప్రభుత్వం.
నాటి బాబు జమానాకి , నేటి జగన్ సంక్షేమానికి తేడా స్పష్టంగా చూపిన జగన్ ఈ విషయంలో ఖచ్చితంగా అభినందనీయుడు .