చిత్తు చిత్తుగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి, ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు నీరు కూడా రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని, కిరణ్ కుమార్ నమ్మకద్రోహి అని దుయ్యబట్టారు.
గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా ఓడిస్తామని, ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించామని, త్వరలోనే ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తామని కాబట్టి వైసీపీ విజయానికి మనమంతా కృషి చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్ధించారు.