వలంటీర్లను జిహాదీ టెరరిస్టులతో పోల్చిన తెలుగుదేశం శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు కన్నెర్ర చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఖండించారు. సేవ చేసే వారిని అంటే చంద్రబాబు పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. వారు సమాజ సేవ చేస్తున్నారు. గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు. సుధీర్రెడ్డి మనిషా.. పశువా.. వలంటీర్లు ప్రజల కుటుంబసభ్యులు లాంటివారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఇలా స్పందించారు. వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. సేవా సైన్యంలో 70 శాతం మహిళలే ఉన్నారు. వారంతా ఉగ్రవాదులేనని టీడీపీ నేతల ఉద్ధేశమా.. వలంటీర్లంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ అభం శుభం తెలియని వలంటీర్లను తిట్టడం దారణమన్నారు. నిజానికి తెలుగుదేశం జిహాదీ పార్టీ. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ వలంటీర్ల ద్వారా ప్రజలకు పక్కాగా సంక్షేమ పథకాలు అందించారు. అందుకే టీడీపీకి వారిపై కోపం. కోవిడ్ సమయంలో వలంటీర్లు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఇలా స్పందించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను తీసేస్తారని చెప్పారు. సేవ చేసే వారిపై చిల్లర మాటలు ఆపాలన్నారు.
అన్ని వర్గాలు సుధీర్రెడ్డి, టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. సుధీర్రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు జీతాలు పెంచుతామని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే సేవా సైన్యాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మొదటి నుంచి హేళన చేస్తూనే ఉన్నారు. దీంతో వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నమ్మే పరిస్థితి లేదు.