‘నేను శ్రీకాకుళం వెళ్లి ఉద్దానం కిడ్నీ సమస్యను గుర్తించా. చంద్రబాబును కలిశా. సీఎంగా ఉన్న ఆయన 24 గంటలు తిరగకముందే మంగళగిరి క్యాంప్ ఆఫీస్కు ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి ఏమి చేయాలని తక్షణ చర్యలు తీసుకున్నారు. రిలీఫ్ ప్రోగ్రాం చేశారు’ తాజా ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.
మరి 2018లో ఇదే సేనాని బాబుపై ఉద్దానం విషయంలో ఏమన్నారంటే.. ‘ఈరోజు ఉద్దానంలో చాలామంది బాధితులున్నారు. ఎంతో దయనీయమైన పరిస్థితులు అక్కడున్నాయి. కనీసం టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంచినీళ్లు ఇవ్వలేకపోతోంది’ ఓ సమావేశంలో అన్నారు. మరో దాంట్లో ‘ఓ వైపు ఉత్తరాంధ్ర బిడ్డలు చనిపోతూ ఉన్నారు. పుట్టిన వెయ్యి మంది పిల్లల్లో 50 మంది సంవత్సరంలోపే మరణిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అసలే నిధుల కొరత ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం పుష్కరాలకు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టింది. దీనిపై అడుగుదామంటే సరైన సమాధానం మాకు రాదు.
ఇది పవన్ రెండు నాల్కల ధోరణి. ఉద్దానం గురించి పట్టించుకోలేదని నాడు పైపైన తిట్టాడు. నేడు ప్యాకేజీ చేతిలో పడడంతో ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెబుతున్నాడు. వీరిద్దరికి ఉద్దానం విషయంలో చిత్తశుద్ధి లేదు. దాని పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాదు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. సీఎం అయ్యాక అక్కడి ప్రజలకు అండగా నిలిచారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న సమస్యకు వైఎస్సార్సీపీ పాలనలోనే పరిష్కారం చూపారు. ఇక్కడ జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బాబు అధికారంలో ఉన్నప్పుడు కనికరం చూపలేదు. తిత్లీ తుఫాన్ సమయంలో సర్వం కోల్పోయిన ఇక్కడి బాధితులు సమస్య చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తే బాబు నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా అంటూ మాట్లాడాడు. కొందరిపై కేసులు పెట్టారు. ఇక పవన్ అయితే రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. 2017లో దీక్ష పేరుతో డ్రామా ఆడాడు. బాబుతో పొత్తులో ఉన్న సమయంలో ఈ సమస్య పరిష్కారానికి పవన్ చొరవ చూపలేదు.
జగన్ సీఎం అయ్యాక ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందిస్తున్నారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.87 కోట్లతో పలాసాలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లలో బెడ్స్ సంఖ్య పెంచారు. కొత్త సెంటర్లు ప్రారంభించారు. రోగులకు 37 రకాల మందులు అందుబాటులో ఉంచారు.
పవన్ దృష్టిలో ప్రజలు గొర్రెలు. వారికి ఏమీ గుర్తు ఉండదు. తాను, చంద్రబాబు ఏం చెప్పినా నమ్మేస్తారని అనుకుంటాడు. ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి మాట రికార్డవుతుంది. మార్చి చెబితే ఇట్టే బయటపడిపోతుంది. కాబట్టి సేనానీ.. మీ పార్ట్నర్పై ప్రేమ ఉంటే మరోలా చూపించు. ఆయన చెయని పనులకు మాత్రం క్రెడిట్ ఇవ్వకు.