పవన్ కళ్యాణ్ తనను అవమానించాడంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పరోక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పదేళ్ళపాటు పార్టీ కోసం పని చేస్తే సీటు కేటాయింపు విషయంలో కనీసం తనను గుర్తించలేదని నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బొలిశెట్టి సత్యనారాయణ ఏమన్నారంటే..
దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడ లేదు అని కొందరి వ్యధ. సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు లేదని కొందరి బాధ. మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుందన్నది వాస్తవం. ఇప్పుడు కావలసింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం. అంటూ తనలో దాగిన బాధను పోస్ట్ రూపంలో వ్యక్తం చేశారు బొలిశెట్టి సత్యనారాయణ.
పవన్ కళ్యాణ్ తనను పదేళ్ల పాటు వాడుకుని ఇప్పడు పక్కనపెట్టేసారని నర్మగర్భంగా తన పోస్ట్ ద్వారా బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారన్న చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అండగా ఉన్న నాయకుల్లో బొలిశెట్టి సత్యనారాయణ ఒకరు. పార్టీ పెట్టి పదేళ్లయినా తనను పవన్ కళ్యాణ్ గుర్తించకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా ఉన్న నాయకులకు కాకుండా ఇప్పుడిప్పుడు వస్తున్న నాయకులకు సీట్లను కేటాయించడంతో ఇప్పటికే చాలామంది నాయకులు పవన్ తీరుతో అసంతృప్తితో ఉన్నారు.
పవన్ కు వాడుకుని వదిలేయడం అలవాటే..
పార్టీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ నీకే తణుకు నియోజకవర్గంలో సీటు అంటూ చివరి వరకూ ఊరించి చివరకు పొత్తులో భాగంగా టీడీపీ నాయకుడు ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో విడివాడ రామచంద్రరావు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని కానీ చివరకు సీటును నాకు కాకుండా వేరొకరికి కేటాయించారని కన్నీటి పర్యంతం అవుతూ ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు పాటంశెట్టి సూర్యచంద్ర. విశాఖ జిల్లాలో సీటు ఇస్తానని ఆశ చూపితే కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు కోటి రూపాయలు పార్టీ ఫండ్ గా విరాళం ఇచ్చారు. చివరికి ఆయనకు మొండిచెయ్యి చూపారు. రాజమండ్రి రూరల్ సీటు నీకే అంటూ కందుల దుర్గేష్ కు హామీ ఇచ్చి చివరకు ఆయనను నిడదవోలు సీటును కేటాయించారు.
అందుకే బోలిశెట్టిని గుర్తించలేదా?
బొలిశెట్టి సత్యనారాయణ గత కొంతకాలంగా టీవీ డిబేట్లలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 40 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ కి భిన్నంగా 24 సీట్లకి పరిమితం అయి తరువాత 21 సీట్లకు తగ్గిపోయాడు. మొదటినుండి పొత్తుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన వాళ్ళను ఉపేక్షించనని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటి వాళ్ళను దూరం పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇదే కోవలో టీవీ డిబేట్లలో సీట్ల గురించి పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన బొలిశెట్టి సత్యనారాయణను అందుకే విస్మరించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించడం పవన్ కు మొదటినుండీ ఉన్న అలవాటే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.