తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే చాలు. వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలిపోయి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తారు. పింఛన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా బాబు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెన్షన్ సొమ్ము కోసం సచివాలయాలకు వృద్ధుల, అనారోగ్యంతో ఉన్న వారిని మంచాలపై మోసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తన యజమాని కోసం పవన్ కల్యాణ్ వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఏ మాత్రం అవగాహన లేకుండా ట్వీట్ చేశారు.
‘ఏపీ చీఫ్ సెక్రటరీ గారూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి?. నా సినిమా రిలీజైతే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు. తహసీల్దార్ల ఫోన్ నంబర్లు ఇస్తారు. మరి అదే ఉద్యోగులను పెన్షన్లు ఇవ్వడానికి వినియోగించుకోలేరా? పెన్షన్లు ఇవ్వడానికి లేరా? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైఎస్సార్సీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకు, బ్లేమ్ గేమ్స్ కు ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి’ అంటూ ఎల్లో స్ర్కిప్ట్ను పోస్టు చేశారు.
2014 – 19 వరకు ఏపీలో పింఛన్దారులు పడిన కష్టాలు పవన్కు తెలియక కాదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీన ఏ విధంగా ప్రతి గడపకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారో తెలుసు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేయాలి కాబట్టి అబద్ధాలను ట్వీట్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచంలో ఉన్న వారు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకే జగన్ వలంటీర్లను నియమించారు. వీరు సులువుగా నగదు ఇస్తున్నారు. చంద్రబాబు గారూ వృద్ధులను ఇబ్బంది పెట్టడం మీకు తగునా.. నిమ్మగడ్డ రమేష్ చేత ఎందుకు ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీని వల్ల ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారని చెప్పకుండా సేనాని తన ట్వీలో మెలో డ్రామాకు తెరతీశారు. తన సినిమాల సమయంలో థియేటర్ల ఉద్యోగులను నియమించారన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు వినోదం అందించాలని నిర్ణయించింది. దీంతో అడ్డగోలుగా టికెట్లు రేట్లు పంపి దోచుకున్న పవన్, కొందరు యాక్టర్లకు ఇబ్బంది కలిగింది. రేట్ల విషయంలో నిబంధనలు చేయడానికి అధికారులు వెళ్తే తప్పు ఎలా అవుతుంది. మీ దోపిడీకి జగన్ ప్రభుత్వం సహకరించలేదనే కదా చాలా సినిమా కార్యక్రమాల్లో నోటికొచ్చినట్లు తిట్టారు.
ప్రస్తుతం అన్ని శాఖల ఉద్యోగులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. దీనిపై పవన్కు అవగాహన ఉందా.. లేక లేనట్లుగా నటిస్తున్నాడో కానీ.. సచివాలయ, రెవెన్యూ యంత్రాంగం కూడా ఎన్నికల మీటింగ్లు, శిక్షణకు హాజరవుతోంది. చాలా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారి ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు కదా అనడిగారు. సుమారు ఐదు సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేస్తున్న వ్యవస్థను చేతిలో పెట్టుకుని కొత్తగా సిబ్బందిని ఎందుకు పంపించాలి. అలవాటు లేని వారిని ఒక్కసారిగా పంపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే విషయం మీకు తెలియదా.. వలంటీర్లు పెన్షన్లు ఇస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రజానీకం బాబు, పవన్ను ప్రశ్నిస్తోంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. వలంటీర్లపై మొదటి నుంచి సేనాని విషం కక్కుతున్నారు.
వలంటీర్ల సేవల వల్ల ఎక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. జనసైనికులు పింఛన్ లబ్ధిదారులను సచివాలయాలకు తీసుకెళ్లాలని సేనాని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అసలు వలంటీర్లు పంచకుండా కుట్రలు చేసి ఇలా చెప్పడం ఎందుకో.. పిఠాపురంలో ఎండలో రెండు రోజులు తిరిగాడో లేదో.. అనారోగ్యం సాకుతో వారాహి విజయభేరి, ఉత్తరాంధ్ర పర్యటనను వాయిదా వేసిన సేనాని విశ్రాంతికి ఉపక్రమించారు. అలాంటి వ్యక్తికి వృద్ధులు, దివ్యాంగుల బాధలు ఎలా అర్థమవుతాయి. మొత్తానికి చంద్రబాబు పాత రోజుల్ని మళ్లీ తెచ్చారు. వాటిని జనసేన సమర్థిస్తోంది.