అత్తకు లేక అటుకులు తింటుంటే అల్లుడొచ్చి అరిసెలు అడిగాడట అట్లుంది టికెట్లు రాని జనసేన నేతలు పరిస్థితి.. టికెట్ మీకే ఇస్తానని ఆశ చూపించి, పార్టీకి ఊడిగం చేసిన ఆశావహులకు టికెట్లు ఇవ్వకుండా వారి నోట్లో మట్టి కొట్టి, టికెట్ రాని నేతలను తన నియోజకవర్గంలో పార్టీ తరపున ప్రచారం చేయండి అనాలంటే ఒక పార్టీ అధినేతకు ఎంత దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఒక్క పవన్ కళ్యాణ్ కి తప్ప మరో నేతకు ఉండదేమో.
వాస్తవానికి జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఏనాడూ సరిగా దృష్టి పెట్టలేదు. తన పార్టీని పక్కనబెట్టి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలు నిజం చేస్తున్నట్లే పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి ఉండటం గమనార్హం. ఒక రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలి అనుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు బలహీనపడితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏ నాయకుడైనా పార్టీని బలంగా తీర్చిదిద్దుతారు. కానీ పవన్ అలా కాదు. తన పార్టీ బలపడుతుందన్న సమయంలో దాదాపు పతనావస్థకు చేరిన టీడీపీకి చేయందించి ఆ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేసారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
తొలుత మూడొంతుల స్థానాల్లో పోటీకి దిగుతున్నామని ప్రకటించి ఆశావహ అభ్యర్థుల్లో ఆశలు రేపారు. తరువాత తన పార్టీ అభ్యర్థుల ఆశలకు పాతరేస్తూ కేవలం 24 స్థానాల్లో పోటీకి అంగీకరించారు. తరువాత మరో మూడు స్థానాలను త్యాగం చేసి 21 స్థానాలకు పరిమితమయ్యారు. ఆ 21 స్థానాల్లో కూడా తన పార్టీకోసం మొదటినుండి పని చేసిన వారికి సీట్లు ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థులకు సీట్లు కేటాయించడం జనసేన పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలా ఆశావహ అభ్యర్థులతో బంతాట ఆడుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా జనసేనలో సీట్లు దక్కని నేతలు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
జనసేనలో టికెట్ దక్కుతుందన్న ఆశతో ఎందరో అభ్యర్థులు పార్టీకి అండగా ఉంటూ కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఎందరో ఆస్తులను కరిగించుకున్నారు. జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర అయితే ఎన్నో ఎకరాలను అమ్ముకున్నానని నాకు టికెట్ ఇచ్చేవరకూ నిరాహారదీక్ష చేస్తానని గతంలో కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. కాకినాడ మాజీ మేయర్ సరోజతో పార్టీకి సంబంధించిన ఖర్చు చేయించి ఆమెకు మొండిచేయి చూపడం, విడివాడ రామచంద్రరావు లాంటి నేతలకు ఝలక్ ఇవ్వడం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం తన తరపున పిఠాపురంలో ప్రచారం చేయమంటూ పిలుపునివ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు జనసేన నేతలు. ఇప్పటికే పార్టీ తరపున ఖర్చు చేసినందుకు తీవ్రంగా నష్టపోయిన నేతలు లబోదిబోమని బాధపడుతుంటే వారిని ప్రచారం చేయమని పవన్ ఆహ్వానించడంపై వారంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఒకవేళ జనసేన అసమ్మతి కూడబలుక్కుని పిఠాపురంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారే అనుకో.. పవన్ ఎన్నటికీ అసెంబ్లీని చూడలేడు.