టీడీపీ శిఖరం పై జనసేన రెపరెపలు
నలభయ్యేళ్ళ రాజకీయ చరిత్రలో టీడీపీకి ఎన్నటికీ చేరుకోలేదు అన్నంత లోతులోకి ఇప్పుడు పడిపోయింది. దానికి కారణం జగన్ కాదు, చంద్రబాబే. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎవ్వరితో అయినా జత కట్టి పొత్తు పూయించడం కోసం గత నాలుగేళ్ళుగా బాబు ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. ఆఖరుకి జైలు గుమ్మం ఎక్కాక.. జనసేనతో పొత్తు కుదిరింది.
అప్పటివరకూ జాతరలో పోతురాజులా తన వాహనం ఎక్కి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఊపు చూసి రాజకీయ విశ్లేషకులు అందరూ ఈసారి పవన్ ఒంటరిగా పోరుకెళ్ళి అయిదో పదో సీట్ల గెలుస్తాడు ఏమో అని ఊహిస్తున్న వేళ, చంద్రబాబు లోపల ఉండేసరికి పవన్ ఒక్కసారిగా జైలు బయటే పొత్తు ప్రకటించేసాడు. అయితే పొత్తు ప్రకటన అంతా ప్యాకేజీలో భాగమనీ, చెప్పాల్సిన డైలాగులు చేయాల్సిన యాక్షనూ అంతా ముందే స్క్రిప్టు ప్రకారం రాసిచ్చేసారని బయట టాకు.
ఇప్పుడు బాబు బయటికి వచ్చాక, జనసేనతో పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు పేరుతో నలభై రోజులు నుంచి జరుగుతున్న భేటీల డ్రామాకి మాత్రం ఇంకా తెర దించటంలేదు. జనసేనకి ఏ టికెట్ ఇస్తారో మాత్రం చెప్పని టీడీపీ మాటిమాటికీ “మాకు పవన్ తోడున్నాడు” అంటూ పవన్ నామస్మరణ మాత్రం విపరీతంగా చేస్తుంది. ఆఖరుకి, ఎన్ని సార్లు ఎంత మందితో పొత్తు పెట్టుకున్నా, ఆ పార్టీ నాయకులతో కలిసి ఉన్న ఫోటోలను, బ్యానర్లనూ రాజకీయ ప్రచారాల కోసం మాత్రమే వాడిన టీడీపీ మొట్టమొదటిసారి, ఆఖరుకి తమ పార్టీ ఆఫీసు పై పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకునేంత స్థాయికి దిగజారిపోయింది.
ఒకవైపు జనసైనికులను జెండా కూలీలుగా చూస్తూ, మరొకవైపు జనసేన బీ ఫారాలను తమ వాళ్ళకే అందించేలా పన్నాగాలు చేస్తూ, పైపైకి పవన్ను వేనోళ్ళ పొగుడుతూ, తమ పార్టీ ఆఫీసు పై ఏనాడూ.. అశోకగజపతి రాజు, కోడెల శివప్రసాద్, అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు వంటి పెద్ద పెద్ద నాయకులవో, లేదా… అంతెందుకు నందమూరి వారసుడు అయిన బాలకృష్ణ ఫోటో కూడా ఎక్కించని బాబు…అధికారం కోసం తన ఫోటోతో పాటుగా పవన్ ఫోటోను కూడా అంటించుకుని, టీడీపీ చరిత్రలో పసుపు తప్ప మరొక రంగు పోస్టరు ఎక్కని చోట చిక్కని తెలుపురంగులో బోర్డు పెట్టుకుని టీడీపీ పరువుని తన సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ మళ్ళీ వాడుతున్నాడు.
ఇవన్నీ తెలియని తెలుగు తమ్ముళ్ళు దానికి “చాణక్యం” అని, “అష్ట దిగ్బంధనం” అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. అంతే తప్ప పవనూ, బీజేపీ సహాయం లేకుండా కేవలం ఇరవయ్యేళ్ళ రాజకీయ అనుభవం కూడా లేని జగన్ ని ఢీ కొట్టేందుకు పోతున్నాడు బాబు అని మాత్రం అనుకోవటం లేదు.