జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆస్కార్స్థాయి నటుడు. కాకపోతే అది సినిమాల్లో కాదు. రాజకీయ జీవితంలో.. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఒక గజినీ ఉన్నాడు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడం సేనానికే చెల్లింది. స్వార్థంలో చంద్రబాబు నాయుడికి పోటీ ఇస్తుంటారు. బుధవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం – జనసేన ఉమ్మడి సభలో ‘నాలుగు దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, ప్రజల లబ్ధి కోసమే ఉంటాయి. మా కూటమికి సహకరిస్తేనే జనం భవిష్యత్ బాగుంటుంది.’ పవన్ అన్నారు.
ఇది సోషల్ మీడియా యుగమని పవన్ మర్చిపోయినట్లు ఉన్నారు. 2019 ఎన్నికల కోసం టీడీపీ నుంచి విడిపోయాక ఆయన తెలుగుదేశం, చంద్రబాబు, లోకేశ్ను తిట్టిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసిందన్న నాలుకతోనే 2018 సేన ఆవిర్భావ సభలో కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు. ఆయన 2019లో గెలిస్తే నీతి అనేది ఉండదు. అంతటా అవినీతిమయం అవుతుందన్నారు. నాడు అన్నేసి మాటలు చెప్పిన పవన్కు నేడు స్వరం మార్చడం వెనుక మర్మం ఏమిటో..
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని సేనాని అన్నారు. అదే 2018లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో బాబుకు అనుభవం ఉందని 2014లో మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఆయన, మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని వ్యాఖ్యానించారు. ఈ అవినీతి సర్కారు టపాకాయలా పేలిపోవడం ఖాయమన్నారు. నీతిమంతుడు అయ్యేందుకు బాబు పాప ప్రక్షాణన ఏమైనా చేశాడా.. అంటే లేదు. 18లో ఆయన అనుభవం వద్దని.. 24కు వచ్చేసరికి ఎందుకు కావాలనిపిస్తోంది.
ప్రజల లబ్ధి కోసమే తన నిర్ణయాలుంటాయని సేన అధినేత చెప్పుకొచ్చారు. ఇంటి రిపేర్ సాకుతో స్టార్ హోటళ్లలో ఉండేందుకు బాబు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పవన్ నాడు ఓ సందర్భంలో అన్నారు. మరి ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిన అవినీతిపరుడితో ఎందుకు చేతులు కలిపినట్లు?, అలాగే కుక్క బిస్కెట్లలా 10, 15 సీట్లు ఇస్తే నేను తీసుకోవాలా.. మేము ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాలేమా 19 ఎన్నికలప్పుడు అన్నారు. ఇప్పుడేమో కేవలం 24 సీట్లు తీసుకున్నారు. బాబు ఏం ఆశ పెడితే తలొగ్గినట్లు..
ఒకప్పటి పవనుడి పలుకులు
‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జీలకర్రలో కర్ర లేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. బాబు జేబులో జాబు లేదు’
‘ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు పేపర్లలో ఎలా వస్తాయి. ఆయన (బాబును ఉద్దేశించి) చెప్పకపోతే. పవన్ ఇట్లా అడిగాడు. డబ్బులు, సీట్లు అడిగాడు. లొంగిపోయాడని రాయించారు’
‘సీఎం చంద్రబాబును కలిసినప్పుడు రాజధాని నిర్మాణానికి 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఉంటే చాలు. చాలా అద్భుతమైంది కట్టొచ్చన్నారు. ఇది 33 వేల నుంచి లక్ష ఎకరాల వరకు విస్తరించింది. అభివృద్ధి కొందరికేనా.. అందరికీ కావాలి కదా.. ఆ దిశగా తెలుగుదేశం నాయకులు ఆలోచించడం లేదు. రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రమైతే మిగిలిన ప్రాంతాలు ఏమి కావాలి. తెలంగాణ ఉద్యమంలా మరో ఉద్యమం రాదా..
‘అమరావతి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఎక్స్క్యూజివ్గా తెలుగుదేశం అఫ్లియేటెడ్ క్యాపిటల్లా ఉంది. ప్రతి జిల్లా వారు, వర్గాలు అమరావతిలో స్థిరపడాలంటే కుదిరే పనిలా కనిపించడం లేదు. ప్రతి అంశంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది’
‘చంద్రబాబు ఎక్కడ పార్టీ పెట్టారు. పెట్టి ఎవరి ఆసరా లేకుండా గెలవమనండి చూద్దాం. ఛాలెంజ్. ఆయనకు ఒంటరిగా వెళ్లి గెలిచే సత్తా లేదు. ఎన్టీ రామారావు ఫొటో తీసి ఎన్నికలకు వెళ్లలేరు. వాళ్లు ఒక్కరే వెళ్తే జనసేన కూడా ఒంటరిగా వెళ్తుంది’
‘ఎక్కడికెళ్లినా ఉద్యోగాలు లేవు. పరిశ్రమలు రాలేదు. స్కిల్ డెవలప్మెంట్ లేదు. కేవలం నారా లోకేశ్కు జాబ్ వచ్చింది. సంతోషమే. కానీ యువతకు ఉపాధి కల్పించాలి కదా’
‘చంద్రబాబు.. రామారావు నుంచి సైకిల్ తీసేసుకున్నారు. అందుకే దానిని గట్టిగా పట్టుకున్నారు. ఎప్పుడైనా అవసరమైతే ముందు, వెనుక ఒకరిని ఎక్కించుకుని వెళ్తారు’
ఇలా చెప్పుకొంటూ పోతే చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ వదిలిన ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. ఓసారి సేనాని రేప్ చేసిన వారికి రెండు బెత్తం దెబ్బలు పడితే చాలని వ్యాఖ్యానించారు. మృగాళ్ల విషయంలోనే ఆయన ఆలోచన అలా ఉంది. బాబును జైల్లో వేశారని బాధపడ్డారని చెప్పారు. జనం సొమ్మును దోచుకున్న వారిని ఇంకేమి చేయాలో ఆయనే చెప్పాలి. మూడు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలా.. వారు చెబుతున్నట్లు ఇది ప్రజల కోసం ఏర్పడిన కూటమి కాదు. చంద్రబాబుకు అధికారమిస్తే రాష్ట్రాన్ని దోచుకుంటాడు. అందులో నాకు వాటా ఇస్తాడనే ఆశతో పవన్ పొత్తుకు ప్రతిపాదించాడని ఇట్టే అర్థమవుతోంది. మొత్తానికి ఉమ్మడి సభలో ఇద్దరు అధినేతల నిజస్వరూపం బయటపడింది. ప్రజల కోసం కాదు.. తమ స్వార్థం కోసమే కలిసినట్లు చెప్పకనే చెప్పారు.