ఆంధ్రప్రదేశ్ లో మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఆఖరికి వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెనుకంజ వేస్తూ ఉండటం జనసేన శ్రేణులను నిరాశకు గురి చేస్తుంది. దీంతో జనసైనికులే బహిరంగంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ని సినిమాల్లో పవర్ స్టార్ అని కీర్తిస్తూ అభిమానులంతా గుండెల్లో పెట్టుకున్నారు. దీనికి తగ్గట్లే 1999 లో వచ్చిన తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్స్ కి ఎంతో పేరొచ్చింది. ముఖ్యంగా చేతులపై కారు టైర్లు ఎక్కించుకోవడం, పెంకులు బద్దలు కొట్టడం వంటి సాహసాలు చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ సాహసాలను పొగిడారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఊగిపోతూ ప్రసంగాలు చేయడం, వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయాలు చేయడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా ఆయన వీకెండ్ పొలిటీషియన్ గా మారడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పరువుకోసం పాకులాడుతూ చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికల్లో మిగిలిన పార్టీలన్నీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంటే ఎండ ఎక్కువైందని, వర్షం వచ్చిందని, చలి ఎక్కువగా ఉందని, హెలికాఫ్టర్ లేదని ఎన్నికల ప్రచారానికి డుమ్మా కొడుతున్న పవన్ కళ్యాణ్ వైఖరి జనసేన నేతలకు, జన సైనికులకు మింగుడు పడటం లేదు. వర్షం ఎక్కువొస్తే స్కూల్ డుమ్మా కొట్టాలని చూసే స్కూల్ విద్యార్థిలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉండటం జనసేన శ్రేణులకు అంతుచిక్కని ఆవేదనగా మారింది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చి ఎండకు తాళలేక వడ దెబ్బ తగిలి జ్వరం వచ్చిందని ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపేసి హైదరాబాద్ వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ మరో సందర్భంలో ఎన్నికల ప్రచారంలో తనను బ్లేడ్లతో గాయ పరుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం సాకు చూపించి ప్రచారానికి డుమ్మా కొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
అనంతరం రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయ్యొదంటూనే , కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చెయ్యొద్దని పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ జనసేన కొత్త రాగం ఎత్తుకుంది. ఎండ వస్తే వడ దెబ్బ, వాన పడితే జలుబు, చలి వేస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటూ ప్రచారాన్ని ఎగ్గొట్టేందుకు అన్ని రకాల సాకులని వెతుక్కుంటున్నారనే అపవాదు పవన్ కళ్యాణ్ మూట గట్టుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తిందని, ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేశామని జనసేన ప్రకటించడం జనసేన శ్రేణులను అసహనానికి గురి చేస్తుంది.
ఓ వైపు తనపై దాడి జరిగిన ఆ బాధను దిగమింగి మరీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన సీఎం జగన్ కి ఉన్న తెగువ, ధైర్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో లేవని జనసేన పార్టీ నేతలే సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ లా ఎన్నికల ప్రచారాన్ని చిత్తశుద్ధితో చేయడం మాని ఓపిక, ఓర్పు లేకుండా ప్రచారాన్ని ఎగ్గొట్టేందుకు ఆరోగ్య కారణాలను, సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ ఎన్నికల ప్రచారానికి డుమ్మా కొడుతూ సభలను వాయిదా వేస్తున్న పవన్ కళ్యాణ్ ఇదే పంథా కొనసాగిస్తే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.