పవన్ కళ్యాణ్.. ఓ ఫెల్యూర్ పొలిటీషియన్. తనతో, తన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు అయిపోయారు. కానీ ఈ జనసేన అధినేత మాత్రం నిలకడలేని మనస్తత్వంతో ఎటూ కాకుండా పోయాడు. ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. దానిని సరైన మార్గంలో ఉపయోగించుకోలేక చతికిలపడుతున్నాడు.
ప్రజారాజ్యంతో మొదలైన పవన్ ఓటముల ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014లో జనసేనను స్థాపించినా పోటీ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో అక్కడే తప్పటడుగులు పడ్డాయి. అవి ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. ఎమ్మెల్యే, ఎంపీనా అనే క్లారిటీ లేదు. తనకంటూ ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుని ఫోకస్ చేయలేదు. ఎంతసేపూ చంద్రబాబు నాయుడి కోసమే రాజకీయాలు చేస్తూ రావడంతో 2019లో భీమవరం, గాజువాకలో దారుణంగా ఓడిపోయాడు. పార్టీ అధినేత ఓటమి పాలవడంతో అటు కాపు సామాజికవర్గంలో, ఇటు కార్యకర్తల్లో నమ్మకం పోయింది. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న పవన్ ఆశలు గలంతయ్యాయి.
19 ఓటమి నుంచి పవన్ పాఠాలు నేర్చుకోలేదు. ఆయన అడుగులు మళ్లీ కూడా తడబడ్డాయి. 2024 ఎన్నికలు వచ్చేసరికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న బీజేపీతోనే కలిశారు. టీడీపీని కౌగలించుకున్నారు. తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకుని సీఎం సీఎం అని అరిచిన నోళ్లను మోసం చేశారు. తెలుగుదేశంతో పొత్తు సమయంలో మొదట 50 నుంచి 60 అసెంబ్లీ అన్నారు. తర్వాత ఆ సంఖ్య 50 నుంచి 40కి చేరింది. 40 నుంచి 30కి పడింది. తీరా బాబు 24 శాసనసభ, మూడు ఎంపీ ఇచ్చి మమ అనించారు. దీనిని తన కార్యకర్తలు, నమ్ముకున్న కాపులు వ్యతిరేకించినా సేనాని పట్టించుకోలేదు. పూర్తిగా బాబుకు లొంగిపోయారు. ఇప్పుడు బీజేపీ రాకతో సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ అడిగిందే లేటన్నట్లుగా మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలు ఇచ్చేశారు. ఇంతటితో ఆగలేదు. తనకు మిగిలిన వాటిల్లో ఓ పది చోట్ల చంద్రబాబు మనుషులే జనసేన నుంచి పోటీ చేసేలా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
పవన్ ఎందుకు ఇలా తగ్గి ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. సేనాని మాటలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. తనను కనీసం ఒక్కచోట అయినా గెలిపి ఉంటే బలంగా ఉండే వాడినని.. మీరు అలా చేయలేదని ఓ సందర్భంలో చెప్పారు. తనకు పదవులపై ఆశ లేదని ఓటమిపై బాధ లేదని ఓసారి అన్నారు. ఇటీవల వ్యూహాలు తనకు వదిలేయాలని, ఎంపీ, ఎమ్మెల్యేకే పరిమితం చేయొద్దన్నారు. తన ఆలోచనలన్నీ దేశం, రాష్ట్రం చుట్టూ తిరుగుతుంటాయని కలరింగ్ ఇచ్చారు. ఇలా కన్ఫ్యూజ్ చేస్తుండడంతో సేనాని ఓడిపోతున్నాడేమో అనే అనుమానం రాకమానదు.
వాస్తవానికి పిచ్చిపిచ్చిగా మాట్లాడినా పవన్కు చట్టసభల్లోకి వెళ్లాలనే కోరిక మాత్రం చాలా ఎక్కువగా ఉంది. లోకేశ్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. జగన్ జనం మనసులను గెలిచి సీఎం అయ్యాడు. తెలంగాణలో చూస్తే కేటీఆర్ ఎన్నికల్లో గెలిచి మంత్రిగా చేశాడు. ఇలా చాలా ఉదాహరణలు ఆయన్ను వేధించడం మొదలుపెట్టాయి. అందుకే 24లో పార్లమెంట్, అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారని తెలిసింది. ఎక్కడి నుంచి అనేది ఇంకా తేలాల్సి ఉంది. రెండింటి నుంచి పోటీకి కూటమిలోని బీజేపీ, టీడీపీ ఒప్పుకొన్నట్లు సమాచారం. ఎంపీ అయితే కేంద్రమంత్రి అవ్వొచ్చని, ఒకవేళ ఎమ్మెల్యే అయ్యి కూటమి గెలిస్తే రాష్ట్ర మంత్రి అయిపోదామనే ఆలోచనలో ఉన్నారు. రెండుచోట్ల ఓడిపోతే ప్లాన్ బీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తను ఓడిపోయి కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ చేయాలని ఇప్పటికే బాబును కోరారట. ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో అవకాశం ఇవ్వాలని.. ఇది జరిగినప్పుడు తప్పనిసరిగా మంత్రిని చేయాలని చెప్పారట. ఇప్పటికైతే నారా వారు కూడా ఒప్పుకొన్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సీఎం అవుతాడని జనసైనికులు భావిస్తే చివరికి ఇలా ఎమ్మెల్సీ పదవి కోసం పవన్ బతిమిలాడుకుంటున్నాడు. ఈసారి చట్టసభల్లోకి వెళ్లకపోతే తనకు రాజకీయాలు వేస్ట్ అని, జనం ఏ మాత్రం పట్టించుకోరని చివరగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సేనాని మొదటి నుంచి నిఖార్సైన రాజకీయాలు చేసుకుంటే ఈపాటికి ఏదో ఒక పదవిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు. ఎంతసేపటికీ చంద్రబాబు కోసమే బతికితే చివరికి మిగిలేది బాగా మాసిపోయిన ఎర్ర కండువా మాత్రమే.