మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామాన్ని అడ్డు పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన రాజకీయ లబ్ధి కోసం గ్రామాన్ని వాడుకుని వారికిచ్చిన హామీలను గాలికొదిలేశాడు. అసలు ఆ ఊరి పేరు కూడా ఆయనకు ఇప్పుడు గుర్తు ఉండకపోవచ్చు.
కొంతకాలం క్రితం ఇప్పటంలో పవన్ తన పార్టీ ప్లీనరీ పెట్టారు. ఈ సమయంలో గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆయన మాటలు నీటిపై రాతలని మరోసారి నిరూపితమైంది. ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉండగా రహదారుల విస్తరణలో భాగంగా అధికారులు ఇప్పటంలో ఇళ్ల ప్రహరీలు, కొందరి ఇళ్లు తొలగించారు. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ పవన్ ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని కుట్ర పన్నాడు. తన సభకు స్థలం ఇచ్చారని కోపంతో కూల్చేశారని ఆరోపించారు. ఇది కక్ష సాధింపు అంటూ ఆయన రాజకీయ కోణంలో పరామర్శలు కూడా చేశారు. ఒకడుగు ముందుకేసి రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఇది జరిగింది 2022 ఆఖర్లో. టీడీపీ కూడా ఈ వ్యవహారంలో తలదూర్చింది. స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గ్రామానికి వెళ్లారు. అయితే వారికి ఎదురు దెబ్బ తగిలింది. తమకు ఎవరి సానుభూతి వద్దని, అభివృద్ధిని వ్యతిరేకించడంలేదని స్థానికులు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పవన్, లోకేశ్కు మాటలు రాలేదు. దీంతో జనసేనాని అలకబూని 53 మందికి గానూ 39 మందికే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకొన్నాడు.
ప్రభుత్వాన్ని ఎలాగైనా బజారుకీడ్చాలని టీడీపీ, జనసేనలు కలిసి కొందరు గ్రామస్తులను రెచ్చగొట్టి హైకోర్టులో పిటిషన్ వేయించాయి. షోకాజ్ నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్లు రుజువులు సమర్పించడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించిన 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా వారి చేత కేసులు వేయించి పరువు పోయేలా చేశాడు పవన్. ఆయన నగదు ఇస్తానని హామీ ఇచ్చాక అనేకసార్లు మంగళగిరికి వచ్చాడు. అయితే మాట మాత్రం నిలబెట్టుకోలేదు. అంతేలే.. అప్పుడొకసారి హైదరాబాద్లో నడిరోడ్డుపై కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడుతున్నానంటూ హంగామా చేసి రూ.కోటి ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత అతీగతీ లేదు. ఇప్పటం సంగతి ఇంతే. ఎంతైనా ఈ అజ్ఞాతవాసి గాలి మాటలు చెప్పడంలో దిట్ట కదా..
– వీకే..