పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు స్వయంగా ఆయనే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని, ఎంపీగా పోటీ చేసే ఆలోచన కూడా లేదని, ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఎమ్మెల్యే, ఎంపీ రెండు స్థానాల్లోనూ పోటీ చేయమని చాలామంది పెద్దలు నన్ను కోరారు. కానీ, క్రాస్ ఓటింగ్ ఉంటుందా? నిలబడతామా? లేదా? ఇలాంటి సందేహాలు ఉంటాయి. ఒక్క విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులుకు ఇచ్చాం, తిరుపతి శ్రీనివాస్ కి వచ్చాం, గాజువాకను టీడీపీ వాళ్లు తీసేసుకున్నారు. పోనీ, పిఠాపురం తీసుకుందాం అంటే మన ఉదయ్ ఉన్నాడు. ఉదయ్ ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెబుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేక పోయాననని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందని పెద్దమనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. బీజేపీని టీడీపీతో పొత్తుకోసం కాళ్ళా వేళ్ళా పడి ఒప్పించానని గతంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా మధ్య వర్తిత్వం చేసి పవన్ టీడీపీకి లబ్ది చేకూర్చాల్సిన అవసరం ఏముందని జనసేన కార్యకర్తలే వాపోతుండడం గమనార్హం.