ఇతర పార్టీ నుంచి వచ్చిన వారి కంటే సొంత పార్టీ వారే ముఖ్యమని ఇటీవల ప్రకటించిన చంద్రబాబు ఆ మాటపై నిలబడలేదు. ఇతర పార్టీల నాయకుల కోసం తెలుగు తమ్ముళ్లతో ఆడుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని దూరం పెడుతూ.. టికెట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అనే నాయకుడు బాబు తీరు వల్ల అభిమానుల ముందు కన్నీరుమున్నీరయ్యారు.
ముద్దరబోయిన మాజీ ఎమ్మెల్యే. నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం చెప్పిన ప్రతి పనీ చేశారు. అయితే బాబు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలసు పార్థసారథిని కొనుగోలు చేశారు. నూజివీడు నుంచి ఈ స్థానికేతరుడిని పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇటీవల చింతలపూడిలో జరిగిన చంద్రబాబు సభకు సారథి వాహనాలు పెట్టి ఫ్లెక్సీలు కూడా వేసుకున్నారు. దీంతో ఆ పార్టీలో ముసలం రేగింది. నియోజకవర్గంలోని ముసునూరు మండల టీడీపీ నేతల సమావేశంలో పార్థసారథి పాల్గొని టికెట్ తనదేనని చెప్పారు. దీంతో కొందరు నేతలు ఇవ ముద్దరబోయినతో పని లేదని బయటికి వచ్చేశారు. కొత్త నేత వెంట తిరగడం ప్రారంభించారు.
మేము ఒప్పుకోము
పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దని నూజివీడులోని మెజార్టీ తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తొలుత కాపా శ్రీనివాస్, ముద్దరబోయిన మధ్య సీటు కోసం వార్ నడిచింది. చివరికి తనకు అవకాశం ఇవ్వరని తెలుసుకున్న కాపా పార్టీకి రాజీనామా చేశారు. దిగుల్లేదు.. నేనే అభ్యర్థినని భావించిన ముద్దరబోయినకు టీడీపీ అధినేత పార్థసారథి రూపంలో షాక్ ఇచ్చారు. ఈసారికి సర్దుకుపోవాలని బుజ్జగించారు. అయితే కష్టపడిన తనని కాదని, ఎక్కడి నుంచో వ్యక్తిని తెచ్చి ఎలా పోటీ చేయిస్తారని ముద్దరబోయిన ప్రశ్నించారు. కానీ బాబు టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో శనివారం తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఇన్చార్జిగా ఉన్న తనను సంప్రదించకుండానే పార్థసారథికి కార్యక్రమాలు చేసే అవకాశం ఎలా ఇస్తారని అధిష్టానాన్ని ముద్దరబోయిన నిలదీశారు. తనకు అన్యాయం చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టిన ఆయన్ను చూసి మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా అంటూ నాయకులు సముదాయించారు. రెండు రోజుల క్రితం అధినేతను కలిస్తే సర్వేలు మీ పేరు చెప్పినా.. టికెట్ ఇవ్వలేకపోతున్నానని చెప్పారని అనుచరుల వద్ద వెంకటేశ్వరరావు వాపోయారు. ఏ రోజూ తాను తప్పు చేయలేదని, ఈ పరిస్థితి రావడం నిజంగా బాధాకరమని కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చాలన్నారు. పార్థసారథికి సీటు ఇస్తే ఓడిస్తామన్నారు. బాబు ఆదేశాలతోనే కొందరు నేతలు సారథి కోసం పనిచేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయకుల్ని వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. టీడీపీకి జనంలో హైప్ తీసుకురావడం కోసం కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభపెట్టాడు. ఇది చెత్త రాజకీయమంటూ తెలుగు తమ్ముళ్లే్ల ఆగ్రహంతో ఉన్నారు. మొదటి నుంచి ఉన్న వారిని కాదని, కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని చూడటంతో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మొత్తంగా బాబు తన నేతలతో బంతాట ఆడుతున్నారు. ఉంటే ఉండండి.. పోతో పోండి అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. నారా వారి దృష్టిలో కొత్త కరివేపాకు ముద్దరబోయిన.