వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విషయంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మాయని మచ్చ మిగిలిపోతుంది. టీడీపీ, జనసేన నాయకులు గతంలో అనేకసార్లు వేదికలపై సూటిపోటి మాటలతో రెచ్చిపోయి పైశాచిక ఆనందం పొందారు. ఎల్లో మీడియా ప్రస్తుతం నిందితుడిని మోసే బాధ్యతను తీసుకున్నాయి. అతడిని కాపాడేలా వారి ప్రవర్తన ఉంది. దీనిని బట్టి నాడు ముమ్మాటికీ జగన్ను హత్య చేసేందుకు అందరూ కలిసి కుట్రపన్నారని అర్థమవుతోంది.
అసలేం జరిగింది?
2018 అక్టోబర్ 25వ తేదీన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని షాక్కు గురిచేసింది. జనుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఇతను ఎయిర్పోర్టులో టీడీపీ గాజువాక నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేవాడు. అదే ఏడాదిలో జనవరి 30న ఉద్యోగంలో చేరాడు. యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్కుమార్ సిఫార్స్ మేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో చేర్చుకున్నట్లు ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా తెలిపారు. విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ భద్రతా వలయంలో ఉంది. లోపలి రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీల్లో జాబ్ చేరడం ఆషామాషీ వ్యవహారం కాదు. శ్రీనివాస్పై పలు కేసులున్నాయి. పాతనేరస్తుడైన ఇతడికి హర్షవర్ధన్ చౌదరి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇప్పించి రెస్టారెంట్లో చేర్చుకున్నాడు. జగన్ ఎయిర్పోర్టుకు వస్తారని తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది.
టీడీపీ కుట్రలు
వాస్తవానికి హర్షవర్ధన్ చౌదరి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ టికెట్ ఆశించాడు. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఆ సమయంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే హత్యాయత్నం జరిగాక టీడీపీ కుట్రలకు తెరతీసింది. ఒక మనిషిని అంతమొందించాలని చూస్తే ఏ మాత్రం చలించలేదు. పైగా సానుభూతి కోసం జగన్ ఆడుతున్న నాటకమంటూ దుష్ప్రచారానికి దిగింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని ఫ్లెక్సీలు రూపొందించి తప్పుడు ప్రచారం చేశారు. తెలుగుదేశం నేతలు మీడియా సమావేశాలు పెట్టి ఇష్టామొచ్చినట్లు వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్యనేత’ ఆదేశాలున్నట్లు ప్రచారం ఉంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా అనేక ప్రయత్నాలు చేసింది. అయితే నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్పై విడుదలైన సందర్భంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్ జగన్కు సానుభూతి తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల కుట్రలు బయటపడ్డాయి.
ఎన్ఐఏ దర్యాప్తులో..
జగన్ తరఫు న్యాయవాదుల పిటిషన్ మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఇందులో అనేక విషయాలు వెలుగు చూశాయి. శ్రీనివాస్ తన అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ.. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడపై సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది.
తక్కువ చేసి చూపేందుకు..
గోదావరి జిల్లాల్లో కోడి కత్తి తగిలి ఇద్దరి మృతి అంటూ 2023 సంవత్సరం జనవరి 16వ తేదీన ఈనాడు ప్రచురించింది. అయితే కోడి కత్తితో పొడిస్తే చనిపోతారా అంటూ గతంలో టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోడి కత్తి జగన్ అంటూ దిగజారి మాట్లాడారు. ఈ హత్యాయత్నాన్ని తక్కువ చేసి చూపేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కాకమ్మ కథలు అల్లాయి. అసలు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్కు సంబంధం ఏంటి?, నిందితుడు పాత నేరస్తుడైనా ఉద్యోగం ఎలా ఇచ్చారు?, జగన్కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు వారంతా సమాధానాలు చెప్పాల్సి ఉంది. హత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయ ప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నాయి. ఎన్ఐఏ వెల్లడించిన విషయాలు పరిగణలోకి తీసుకోకుండా పక్కా పథకం ప్రకారం కథనాలు వండి వారుస్తున్నాయి. ఈ ఘటనలో జగన్ బాధితుడు. అయితే చంద్రబాబు అండ్ కో నిందితుడిపై ప్రేమ చూపిస్తున్నాయి. జగన్పై ద్వేషంతోనే వారంతా ఇలా చేస్తున్నారు.