2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది . నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపు అందుకుంది . ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బి ఫారాలు అందజేయడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఆర్డీఓ కార్యాలయాల్లో కానీ, మండల ఆఫీస్ లో రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్ల స్వీకరణ చేపడతారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29న అవకాశం ఇచ్చారు, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాను ఏప్రిల్ 29న ప్రకటించనున్నారు. మే 13న పోలీంగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీస్ గేటు నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పటి వరకు సాఫీగా సాగిన ప్రచారం, ఇప్పటి నుంచి ఊపు అందుకోనుంది.