2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి ఘట్టం అయిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 18వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వగా ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 4262 నామినేషన్లను దాఖలు చేసారు. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 745 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారిక వెబ్సైటు ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 1017 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ స్థానం నుంచి 38 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు పులివెందులలో సిఎస్ఐ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో పాల్గొని తర్వాత స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. టిడిపి, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాన్ లు ఇప్పటికే దాఖలుచేశారు. నామినేషన్ లకి చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దాఖలు అయ్యాయి . ఈ ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించి 1500 మంది పైగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్లమెంట్ కు సంబంధించి దాదాపు 300 మందికి పైగా నామినేషన్లు ఈరోజు దాఖలు చేశారు. తెలంగాణలో కూడా పార్లమెంట్ కి సంబంధించి 400 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేయగా, అసెంబ్లీ స్థానం నుంచి ఈ ఒక్కరోజు 20 మందికి పైగా నామినేషన్లు వేశారు. ఇంతటితో నామినేషన్ల ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. రేపు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది.