ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దారుణంగా తయారైంది. ఇంతకాలం కష్టపడిన నేతలను కాదని వలస నేతలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. తెలుగుదేశం ఇచ్చిన సీట్లను అమ్మేసుకుంటున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా చీఫ్ పురందేశ్వరి, ఆమె భర్త దుగ్గుబాటి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
వాస్తవానికి టీడీపీతో పొత్తు కమలం నాయకులకు ఇష్టం లేదు. కానీ పురందేశ్వరి, చంద్రబాబు నాయుడి సన్నిహితులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరుల ఒత్తిడితో ఒప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ పది అసెంబ్లీ, ఆరు లోక్సభ సీట్లు ఇచ్చింది. ఇందుకోసం జనసేనకు ఇచ్చిన వాటిల్లో మూడు శాసనసభ, ఒక ఎంపీ సీట్లను తగ్గించింది. సాధారణంగా ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటే కాషాయ పార్టీ అగ్రనేతలు తమకు పట్టు ఉన్న చోట పోటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీలో దానికి బ్రేక్ పడింది. చంద్రబాబు ఇచ్చిన అరకొర సీట్లను సీనియర్లను కాదని ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఇచ్చేందుకు సిఫార్సు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
పార్టీలో చాలామంది ముఖ్య నేతలున్నారు. వారిలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, కిరణ్కుమార్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, మాధవ్ తదితరులున్నారు. అయితే ఈ ఆరుగురికి అనువైన సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీకి తామే దిక్కన్నట్లుగా పురందేశ్వరి వ్యవహరిస్తూ చంద్రబాబు చెప్పినట్లుగా ఆడుతున్నారు. లేనిపోని సర్వే నివేదికలు చూపించి.. వారిని పోటీకి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భర్త వెంకటేశ్వరరావుతో కలిసి చక్రం తిప్పుతున్నారు.
పురందేశ్వరి హస్తిన ప్రతినిధి బృందాన్ని గుప్పిట్లో పెట్టుకుని విజయవాడలో ఉండి కూడా సీట్ల చర్చల్లో పాల్గొనలేదని, తన సోదరి భర్త అయిన చంద్రబాబుతో చర్చలు జరిపి తనకు రూ.కోట్లు తెచ్చిపెట్టే సీట్లను ఖరారు చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు వాటిని వేలం వేసి మరి అమ్మేస్తున్నారని ఏపీలోని జాతీయ నేతలు రగిలిపోతున్నారు. బాబు సూచనలతో బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, గోనుగుంట్ల సూర్యనారాయణ తదితరులు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఇప్పటికే హైకమాండ్కు స్థానిక నేతలు ఫిర్యాదులు చేశారు. వారు వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. చివరికి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో.